Sunday 18 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (54)



విజ్ఞుడగువాడు మెప్పొందు వికృతుడైన


ఇంద్రజిత్తు కపివరుని రావణ సభముందు నిలిపాడు బంగరు గద్దియపై అసమాన తేజస్సంపదతో వెలుగొందే రావణుని చూచి 


అహెూ రూప మహో ధైర్యం అహో సత్త్వ మహెూధృతిః 

అహెూ రాక్షస రాజస్య సర్వలక్షణ యు క్తతా.

స్యాదయం సుర లోకస్య స శక్రస్యాపి రక్షితా 

అయం హ్యుత్సహతే శ్రద్ధః కర్తుమేకార్ణవం జగత్.


ఆహెూ! ఏమి రూపం! ఏమి ధైర్యం ! ఏమి సత్త్వం! ఏమి శాంతం! మూర్తీభవించిన సర్వ శుభ లక్షణ లక్షతుడై విలసిల్లే యీ రాక్షస రాజు సురలోకమును సైతము పాలింప శక్తి సంపన్నుడు. ఇతడే అలిగిననాడు లోకాలను, సముద్రమున ముంచెత్తకపోవునా! అటువంటివానిని పరదారా వ్యామోహం ఎంతగ పెడదారి పట్టించినదో గదా!


అలాగే లంకేశ్వరుడును మారుతిని చూచి - 


శంకా హృతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసా వృతం 

కిమేష భగవాన్నందీ భవేత్పాక్షాదిహా గతః  

యేన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా 

సోయం వానరమూర్తి స్యాత్ కిం స్విద్బాణోవ్ వా సురః 


వీడు ఎచటినుండి ఇటకు వచ్చినాడు ? ఏ పనికై వచ్చి యుండును? వచ్చినవాడు వనభంగము చేయనేల? రాక్షసులను నిర్జింపనేల? అలనాడు కైలాసగిరిని కదలింప నందీశ్వరుడు నాపై ఆగ్రహమును చూపెను కదా! అతడే యీ కపి రూపాన వచ్చి యుండునా? ఏమీ తేజము? కానిచో బాణాసురుడు యీ ఆకృతిన రాలేదు కదా! అని శంకా హృతాత్ముడాయెను.


ఈ సన్నివేశంలో ఆంజనేయుడు నిర్వహించిన పాత్ర అసాధారణమైనది. కార్యసాధకుడు సమయస్ఫూర్తితో బాగుగా ఆలోచించి ఆత్మవిశ్వాసంతో సమయోచిత నిర్ణయం చేయగల ధైర్యస్థైర్యాలు, బుద్ధి విశేషం- తరతరాలవారికి తరగనిగనిలా అందించిన ఆదర్శవంతుడు.

No comments:

Post a Comment