Tuesday 20 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (56)



అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తస్తవాలయం 

రాక్షసేంద్ర హరీశస్త్వాం భ్రాతా కుశలమబ్రవీత్.


ఓ రాజా! నేను వాలి సోదరుడగు సుగ్రీవ సచివుడను. నీ సోదరుడైన సుగ్రీవుడు మొదటగా నీ కుశలం అడగనున్నాడు. జనకుని మాటను జవదాటక రాముడు సీతా లక్ష్మణ సహితుడై విపిన భూములకేతెంచి- దండాకాటవీన నపహృతయైన జానకి నన్వేషించుచు ఋష్యమూకము చేరినాడు. రామ, సుగ్రీవులు మిత్రులుగ పరస్పరం ప్రతిజ్ఞలు చేసుకున్నారు. వాలిని నీవెరుగుదువు గదా! ఒక్క బాణముతో వాలిని వధించి సుగ్రీవుని కిష్కింధకభిషిక్తునిగ చేసినాడు. సుగ్రీవుడు సర్వ దిశలకూ సీతాన్వేషణకై వానర వీరుల నంపినాడు. నేనిచటి కామె నన్వేషింప వచ్చి


"దృష్టా హీయం మయా దేవీ లబ్ధం యదిహ దుర్లభం 

ఉత్తరం కర్మ యచ్ఛేషం నిమిత్తం తత్ర రాఘవః.


ఆశోకవనాన జనక నందినిని చూచాను. ఇక మిగిలిన కార్యమును నిర్వర్తించుటకు అచట రఘురాముడున్నాడు. మున్ముందు జరుగబోవు తీవ్ర పరిణామం నీవు గమనించినట్లు లేదు. నీ హితము కోరి చెప్పు నా హితవు నాలకింపుము. 


జన స్థాన వధం బుద్ధ్వా బుద్ధ్వా వాలి వదం తథా


రామసుగ్రీవ సఖ్యంచ బుధ్యస్వ హితమాత్మనః


జనస్థానమున నీ అనుంగు సేవకులు ఖర, దూషణాదులను మన్ను కరపించినదీ- నిన్ను చంకన ఇరికించి సప్త సముద్రాల ముంచి ఊపిరితో వదలిన బల పరాక్రమశాలి వాలిని ఒకే ఒక్క బాణంతో నేలకూల్చిందీ - రాముడు. ఆ రామ, సుగ్రీవ సఖ్యం నీకు ప్రాణాంతకం అన్నది గుర్తుంచుకో. రాజా! నీవు తెలియనివాడవనుకోను. తపస్సంపన్నుడవు. సర్వశాస్త్ర విశారదుడవు. మీదు మిక్కిలి ధర్మము నెరిగినవాడవు. బుద్ధిమంతుడు క్షణక్షణం ప్రమాదాల నిలయం అధర్మ కార్యం అని - వాని జోలికి పోడు. నీ ఈశ్వర భక్తి- తపశ్శక్తి అధర్మము నుండి కాపాడలేవు. దేని ఫలితము దానిదే. ఇప్పటివరకు ధర్మఫలితము ననుభవించావు. ఇక అధర్మ ఫలితాన్ని రుచి చూడబోతున్నావు.

నీ వశమందున్న సీతను సామాన్య స్త్రీగా భావింపకుము. ఆత్మరక్షణ సమర్ధురాలయ్యు- అది తన నాథుని కపయశమని ఆగింది. "గృహ్యయాం నాభి జానాసి పంచాస్యమివ పన్నగీం." ఆమె నీ ఇంట నున్న పంచాస్య పన్నగమని తెలిసికో. 

విష సం సృష్ట మత్యర్ధం భుక్తమన్న మివౌజసా. 

అవివేకియైనా విషం తినాలనుకుంటాడు! ఆమె కాళరాత్రి. లంకా నాశనకారిగా గ్రహించు.

కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశినీం 
తదలం కాలపాశేన సీతా విగ్రహ రూపిణా.

No comments:

Post a Comment