Monday 10 January 2022

శ్రీ హనుమద్భాగవతము (127)



ఉత్తరదిశయందుగల సముద్రతటముపై శ్రీ ఆంజనేయుడు దిగెను. ఆ ప్రదేశములో భగవంతుని భజించుచున్న ఒక ముని వర్యుని గాంచెను. శ్రీహనుమంతుడు విరక్తుడగు మహర్షితో ఇట్లుపల్కెను. "మునివరా! నేను శ్రీరామ చంద్రుని ఆదేశానుసారముగా ఆయన ప్రాణాధికురాలైన జనక రాజనందిని వార్తను తెలుసుకున్ని సముద్రమును దాటి వచ్చుచున్నాను. దప్పికచే వ్యాకులుడనగుచున్నాను. దయతో నాకు జలాశయమును చూపించుము”.


తపస్వియైన ఆ ముని జపం ఒనరించుచు తన చూపుడు వ్రేలితో ఒక జలాశయమును చూపెను. శ్రీహనుమంతుడు ఆ మహర్షికి తన లంకాయాత్రా విశేషములను చెప్పుచు తానొనరించిన ఘనకార్యములకు తనలో తాను కించిద్గర్వమును పొందెను. సర్వవ్యాపకుడైన భగవంతునకు ఆ విషయము విదితమేగదా! భగవంతుడు భక్తగర్వాపహారి. ఆయన ఆదర్శ సేవకుడైన శ్రీహనుమంతుని హృదయములో సూక్ష్మాతి సూక్ష్మముగానైనా గర్వభావము స్ఫురించుటం ఎట్లా సహించగలడు? తత్ క్షణమే ఆ గర్వభావమును తొలగించుటకు ఆయన ఒక దివ్యలీలను రచించాడు.


శ్రీ పవనాత్మజుడు చూడామణిముద్రికలను, విధాత ఒసంగిన పత్రమును జపం ఒనరించుచున్న ఆ ముని సమీపమున నుంచి తన దప్పికను చల్లార్చుకొనుటకు జలాశయము చెంతకు వెళ్ళెను. అదే సమయములో ఒక చిన్న వానరము ఎగురుతూ వచ్చి శ్రీరామనామాంకితమైన ముద్రికను మహర్షి కమండలములో పడవేసి వెడలిపోయెను.


జలములను త్రాగి శ్రీహనుమంతుడు తిరిగివచ్చాడు. చూడామణి పత్రములతో ముద్రికను కనుగొన లేక ముద్రిక ఏమైనదని మహర్షిని ప్రశ్నించెను.

ఆ మహర్షి కమండలము వైపు చూపెను. శ్రీహనుమంతుడు ఆ కమండలములో హస్తము నుంచి ముద్రికకై వెదకగా శ్రీరామనామాంకితముద్రికలు వందలకొలది ఉన్నాయి. మరల పవనాత్మజుడు కమండలములో చేయి నుంచగా వేలకొలదిగా శ్రీరామాంకితముద్రికలు బయల్వెడలేను.  ఎన్ని పర్యాయములు తీసినా అవి అసంఖ్యాకముగా బయటపడుతున్నాయి. అంగుళీయకములలో తాను తెచ్చిన ముద్రికను హనుమంతుడు గుర్తింపలేకపోయాడు. మహావీరుడు, అంజనీనందనుడునైన హనుమంతుడు పరమాశ్చర్యమును పొందాడు. చకితుడైన శ్రీపవనాత్మజుడు ఆ మహర్షిని ఇట్లు ప్రశ్నించెను.  మునీశ్వరా! అసంఖ్యాకములైన ఈ ముద్రిక లెచటి నుండి వచ్చినవి? వీనిలో నే తెచ్చిన ముద్రిక యేది?

No comments:

Post a Comment