Thursday 3 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (14)



జగత్తునకంతటికీ చెందిన ఈ దేవునికి ధనవంతులు వివిధ నైవేద్యాలనర్పించి పిల్లలకు పంచి పెట్టండి. పిల్లలు పుష్టిగా, బొద్దుగా ఉండాలి కాబట్టి ప్రతి శుక్రవారం, స్వామి ముందు కొబ్బరికాయ కొట్టండి. పిల్లలు వాటిని ఏరుకుంటూ ఉంటే వారి ఆనందాన్ని గమనించండి. ఇట్లా ఉంటే అందరిపై స్వామి అనుగ్రహం చూపిస్తాడు. 

వయసు మీరిన కొద్దీ ఏవో బాధలు, సమస్యలుంటాయి. అతన్ని కొలిస్తే అన్నిటి నుండి విముక్తులమౌతాం. అతని మాదిరిగా నవ్వు ముఖంతో ఉంటాం. అతని పేర్లు సుముఖుడని, ప్రసన్న వదనుడని ఉన్నాయి కదా. మనం నిజమైన భక్తిని చూపించగలిగితే మనకూ ఆ ప్రసన్నముఖత్వం వచ్చి తీరుతుంది. 

అందరూ ఆలయాలకు వెళ్ళడం, కొబ్బరి కాయలను కొట్టడం, స్తోత్రాలు చదవటం మొదలు పెడితే ఇంకా గణేశ ఆలయాలను కట్టవలసి వస్తుంది. 

కొందరు కొత్తగా వినాయక ఆలయాలను కడుతున్నారని హడావిడి చేస్తారు. ఒక్కొక్కప్పుడు కొత్త విగ్రహాన్ని కట్టడానికి బదులు ఎక్కడిదో దొంగిలించుకొని వచ్చి కట్టారనే మాట వినిపిస్తూ ఉంటుంది. అసలు దొంగతనం కూడదు కదా! అందులో దేవతా విగ్రహాన్నా? ఆ మాట ఎందుకు వచ్చింది? దొంగిలిస్తారని, అంటే అక్కడి ప్రజలింకా అప్రమత్తులై ఉంటారు కదా. అట్టి జాగరూకత ఉండాలనే హితబోధ.

No comments:

Post a Comment