Friday 2 June 2023

శ్రీదత్త పురాణము (157)

 


మనస్సుకి విక్షేపం కలిగితే దాన్ని వెంటనే శమింపజేసుకోవాలి. మనస్సు లయమై సుషుప్తిని పొంది దాన్ని ప్రబుద్ధం చెయ్యాలి (మేల్కొల్పాలి), ఇలా నిరంతర జాగరూకుడై యోగి తన మనస్సును ఏ వృత్తులూ లేని స్థితికి చేర్చాలి. ఇదే కషాయపక్వత అంటే ఇదే అఖండాకారత అంటే. ఇదే సమత అంటే. అప్పుడు అతడు నివాత దీప కళికలా నిశ్చలంగా వెలుగుతూ ఉంటాడు. జ్ఞాతృకేయ విభాగళూన్యుడై బ్రహ్మాకారస్థితిలో ఉంటాడు. అతడికి ఏ చలనమూ వుండదు. ఏ రసాస్వాదనమూ ఉండదు. ఏ సంగమూ ఉండదు. వృత్తి శూన్యుడూ బ్రహ్మీభావం పొందిన వాడూ అయిన ఇటువంటి యోగికి హృదయగ్రంధి (అహంకార గ్రంధి) బ్రద్ధలైపోతుంది. సర్వ సంశయాలు పటాపంచలైపోతాయి. కర్మలన్నీ అంతరిస్తాయి. జీవన్ముక్తుడు అవుతాడు.


కార్తవీర్య రాజా! బ్రహ్మాను భవ పర్యంతం యోగావస్థను నీకు ఎరుకపరచాను. దీనితో నువ్వు కూడా బ్రహ్మ సాక్షాత్కారం పొంద గలుగుతావు. ఇది తథ్యం. అయితే నాయనా! ఈ యోగవిద్యను ఎవరికి పడితే వారికి బోధించకూడదు. అవినీతుడికి అస్సలు బోధించరాదు. వినీతుడూ, శుద్ధ చిత్తుడూ అయిన శిష్యుడికే పరీక్షించి బోధించాలి. యోగీశ్వరుడైన స్వామి ఇలా తత్వోపదేశం ముగించాడు. కార్తవీర్యార్జునుని కళ్ళల్లో ఆనందభాష్పములు వరదలు కట్టాయి. హృదయాంబుజం వికసించింది. తనువంతా పులకించిపోయింది. భక్తి ప్రపత్తులతో మరో మారు సాష్టాంగపడి నమస్కరించాడు. చాలా సేపటికి తెప్పరిల్లి మెల్లగా లేచాడు. అంజలి ఘటించి వినమ్రంగా నిలబడ్డాడు. దత్తదేవా! మహానుభావా! అగ్ని కాంతులతో చీకట్లు తొలగినట్లుగా నీ తత్వబోధతో నాలోని మోహాంధకారం తొలగిపోయింది. హృదయాంబుజాన్ని వికసింపజేస్తూ జ్ఞాన సహస్ర భానుడు ఉదయించాడు. హే అకుంఠ ధామన్! నీ పాద పద్మ సేవతప్ప ఈ చీకట్లను తొలగింపజేసేది ఈ సృష్టిలో మరొకటి లేదు. నీ పాదమూలం విశుద్ధి ప్రదం, సర్వరోగ నివారకం సర్వ మంగళ ప్రదం. సర్వయోగ సిద్ధిదాయకం పురుషార్ధ సిద్ధి కోరేవాడు ఎవడైనా సరే కృతజ్ఞుడై నీ పాదమూలాన్ని ఆశ్రయించాలి. మరి దేనిని ఆశ్రయించినా వ్యర్ధమే. అందుకే హంసలూ, పరమహంసలూ వచ్చి ఆనంద మకరందాన్ని ఎగజిమ్మే నీ పాద పద్మాలను యోగ విభవం కోసం కరణువేడుతున్నారు. నీ పాదాలను తదేక దీక్షతో ఆర్చించేవారికి చతుర్విధ పురుషార్థాలూ తమంత తాముగా కోరి సిద్ధిస్తున్నాయి. ప్రభూ! నీ పాద పద్మం కేవలం త్రిమూర్తి వేద్యం. అది సర్వాశ్రయం, సర్వలయకరం, స్వాత్మావభాసం విశదప్రకాశం. నేను ఆ పాద పద్మానికి నమస్కరిస్తున్నాను. అది చల్లనిది. శాంతకరమైనది సుశేవ్యం. శుభప్రదం, శివప్రదం, తాపనాశకం, జన్మజరామయభయాలను తొలగిస్తుంది. ఆశ్రితులందరికీ సారవంతమైన ఆనందాన్నిస్తుంది. నీ పాదపద్మానికి అంజలి ఇస్తున్నాను. తాడునుచూసి సర్పమని అనుకున్నట్లుగా ఈ సద సదాత్మకమైన విశ్వమంతా మాయవల్ల నీలో సత్యంగా కన్పిస్తుంది.

No comments:

Post a Comment