Wednesday 28 June 2023

శ్రీదత్త పురాణము (182)

 


బాల్య, యౌవన, కౌమారాల్లో వార్ధక్యదశల్లో ఎప్పుడైనా ఒక్క ఏకాదశ్యుపవాసం ఉంటే చాలు ఇటూ అటూ పాపాలన్నీ హుష్ కాకి అయిపోతాయి. ఉపవాసం ఉండటంతో పాటు హరి వాసరాన పుణ్యతీర్ధ స్నానం చేసి హేమ -భూ-గో-వస్త్ర-తిలాది దశదానాలలో ఏ ఒక్కటి చేసినా - ఇక చెప్పేది ఏముంది స్వర్గలోక సుఖాలు ఇహలోకంలోనే అనుభవిస్తాడు అంటే ఆశ్చర్యంలేదు. ఆయువు ముగిశాక వైకుంఠ పట్టణవాసం ముమ్మాటికీ తధ్యం. ఇవి చెయ్యని వారు - అంటే ఉపవాసం ఉండలేకపోయినా పర్వదినాన కనీసం తీర్ధస్నానమూ ఏదో ఒక దానమూ కాశింతధ్యానమూ చెయ్యనివారు కచ్చితంగా ఇహపరాలకు చెడతారు. దుఃఖభాగులవుతారు.


ధర్మ మహిమ


మిత్రమా ! నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తంగా చెబుతాను పనిలో పనిగా వినేసేయ్. త్రికరణ శుద్ధిగా జీవించడం - అంటే మనోవాక్కాయకర్మతో ఏ ప్రాణికీ ద్రోహం చెయ్యకపోవడం, ఇంద్రియ నిగ్రహం, దాతృత్వం, హరిసేవాపరాయణత్వం, వర్ణాశ్రమ ధర్మాలను తు.చ. తప్పకుండా పాటించడం - ఇవి కచ్చితంగా నరకాన్ని తప్పిస్తాయి. ఇంకొక్క సంగతి - చేసిన తపస్సుగానీ, చేసిన దానాన్ని గానీ, చేసిన ఉపకారాన్ని గాని పదిమందికి చాటింపు వేసుకోకూడదు. వాటి మహిమ అంతటితో తగ్గిపోతుంది. కనుక స్వర్గార్ధి ఈ పని చెయ్యడు. శక్తివంచన లేకుండా యవలు - వస్త్రాలు - ఛత్రాలు - కందమూల ఫలాలు - అన్న పానీయాలు మొదలైన వాటిని పది మందికీ పంచిపెడితే కలిగే హితం అంతా ఇంతా కాదు. ఎంతటి దరిద్రుడైనా కనీసం జలదానం చెయ్యగలడు కదా! అలా ఏదో ఒకటి దానం చేస్తూ ఆయుర్దాయంలో ప్రతిరోజునూ గొడ్డుబోకుండా చూసుకోవాలి. వైశ్యపుత్రా! ఒకరికి పెట్టనిది తనకు మిగలదు - ఈ రహస్యం అందరూ గ్రహించాలి. ఇది ఇహపరాలకు వర్తించే సూత్రం. దీన్ని పాటించే దాతలు మాలోకం వైపుకి రారు. ఇహంలో దీర్ఘాయుష్మంతులై ధనాఢ్యులై సకల భోగాలు అనుభవించి సత్కీర్తి సంపన్నులై అటు పైన స్వర్గ లోకంలో ఇంద్రభోగాలు ఆస్వాదిస్తారు. ఎన్ని జన్మలైనా వీరికి ఇలాగే సాగుతాయి. నరకం గుమ్మంతొక్క వలసిన అవసరం వీరికి ఏర్పడదు. మిత్రమా! వెయ్యి మాటలెందుకు. ధర్మం సుగతికీ అధర్మం దుర్గతికి దారి తీస్తాయి. అంచేత బాల్యం నుండే ధర్మాచరణను అలవరచుకోవాలి. ఇదీ సారాంశం.


No comments:

Post a Comment