Wednesday 21 June 2023

శ్రీదత్త పురాణము (175)

 


ఏ వ్రతంకానీ ఏ దానం కానీ ఏ తపస్సుకానీ ఏ పవిత్ర కార్యాలు కానీ గంగా బిందువుల అభిషేకంతో సమానంకావని పెద్దలు ఎందరో చెప్పగా విన్నాను. గంగానదిని మిగతా తీర్థాలతో సమానంగా భావించే వాడు దారుణ రౌరవ నరకానికి పోతాడు. గంగామృత జలమంటే - ధర్మద్రవం - గంగా జలం. సమస్త నదీనద వాపీ కూప తటాకాదులకు ఇది బీజప్రాయం. సాక్షాత్తూ వైకుంఠుడి పాద పద్మాల నుండి స్రవించి ముల్లోకాలకు ప్రవహిస్తుంది. ఎంత పవిత్రమైనది కాకపోతే సర్వజ్ఞుడైన మహేశ్వరుడు నెత్తిన పెట్టుకుంటాడు చెప్పు. గంగా జలం నిస్సందేహంగా నిర్గుణ పరబ్రహ్మం, పరా ప్రకృతి. దీనికి సాటి వచ్చేది ఈ బ్రహ్మాండంలో మరొకటి ఏది వుంటుంది? ఎలా వుంటుంది? ఎక్కడ వుంటుంది ? అసంభవం. ఈ పవిత్రనదికి యోజనాల దూరంలో నివసిస్తున్నప్పటికీ నరుడు గంగా గంగా అనుకుంటే చాలు ఏ తీర్ధంలో మునిగినా మునగకపోయినా గంగా స్నాన ఫలం పొందుతాడు. నరకహేతులై ఏ ప్రాయశ్చిత్తానికి లొంగని ఎంతటి మహాపాతకమైనా గంగాజలంతో దగ్ధమైపోతుంది. కనుక జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించి గంగాస్నానం చెయ్యాలి.


బ్రాహ్మణులకి కొన్నింటినే దానం పట్టే యోగ్యత ఉంటుంది. దీన్ని ప్రతి గ్రహ సమర్థత అంటారు. ఇది ఉన్నప్పటికీ అప్రతి గ్రహమే నియమంగా జీవితం గడిపిన సద్వీపుడు తనువు చాలించిన తరువాత తారా రూపం ధరించి ఆకాశ వేదికను అలంకరిస్తాడు. ఊబిలో కూరుకుపోతున్న గోవును కాపాడిన వాడూ ఆ ప్రయత్నంలో మరణించిన వాడూ ఇలాగే గగనాంగనాన తారకలై వెలుగొందుతారు.


స్నేహితుడా! ప్రాణాయామ పరాయణులు యమలోకాన్ని ఉప్పున ఊదేస్తారు. వారు ఎన్ని పాపాలు చేసినా ప్రాణాయామంతో ప్రక్షాళితులవుతారు. నిత్యమూ పదహారు ప్రాణాయామాలు చేస్తే భ్రూణ హత్యా మహీపాతకాల నుండి సైతం విముక్తి పొందుతారు. రకరకాల తపస్సులు వ్రతాలూ, నోములూ, నియమాలూ, నిష్టలూ, గో సహస్ర దానాలూ, అన్నీ కలిపి ఒక ప్రాణాయామానికి సరిపోతాయి. ఆహారపానీయాలను పూర్తిగా త్యజించి నెలకొక్క మారు మాత్రమే ధర్భాగ్రం మీదుగా ఒక్క నీటి బొట్టును మాత్రమే పుచ్చుకొని గొంతు తడుపుకుంటూ సంవత్సర కాలం చేసిన కఠోర తపస్సు అంతా ఒక్క ప్రాణాయామానికి సాటి వస్తుందో రాదో! మిత్రమా! ఎంతటి మహాపాతకం అన్నా చెప్పు, క్షుద్రోప పాతకమన్నా కానీ క్షణంలో ప్రాణాయామానికి భస్మమై పోవలసిందే.


No comments:

Post a Comment