Saturday 17 June 2023

శ్రీదత్త పురాణము (171)

 


వాపీకూప తటాకాలను నిర్మింపజేసిన దాతల పుణ్యానికి అంతు వుండదు. వాటిలో నీళ్ళను త్రాగి ఒక్కొక్క ప్రాణీ దప్పిక తీర్చుకుంటుంటే దాతల పుణ్యం రెట్టింపు అవుతూ వుంటుంది. కనక వారికి అక్షయ స్వర్గలోక నివాసమే. ప్రాణి కోటికి జీవనం, ప్రాణులు త్రాగు నీటిలో వున్నాయి. అంచేత చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారులకూ పశుపక్ష్యాదులకూ నీరందించి దప్పికతీర్చే మహానుభావులు ఇహలోకం విడిచాక శాశ్వతంగా స్వర్గసీమలోనే నివసిస్తారు.


మిత్రమా! ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మర్రి చెట్టు, మూడేశి వెలగ చెట్లు - ఉసిరిక - మారేడు చెట్లు - అయిదు మామిడి చెట్లు - పది చింత చెట్లు నాటిన వాళ్ళు దేవలోకంలో ఇంద్రభోగాలు శాశ్వతంగా అనుభవిస్తారే - తప్ప నరకం ముఖం చూడవలసిన అవసరం వీరికి ఏనాడూ రాదు. ఒడిలో పుట్టి పెరిగి దారితప్పిన పదిమంది సంతానం కన్నా బయటి నేల మీద దారి ప్రక్కన నాటి పెంచిన అయిదుచెట్లు మిన్న - ఫరవాలేదు పత్ర పుష్ప ఫలాలతో ఇవి కూడా పితృతర్పణ చేస్తాయి. అహితాగ్నులై అగ్నిహోత్రులు చేసిన దాని కన్నా పుత్ర సంతానాన్ని పొందిన దానికన్నా దారి ప్రక్కన ఇంత నీడనిచ్చే చెట్టుని నాటినందువల్ల వచ్చే పుణ్యం అత్యధికం. ఇది చేస్తే చాలు అన్నీ యజ్ఞాలు చేసినట్లే. అన్నీ దానాలు చేసినట్లే. పువ్వులతో ఆకులతో కళకళ లాడుతూ పక్షులతో కిలకిల లాడే పచ్చని చెట్టు నరికే మూఢులు పోయేది ఘోరనరకానికే.


తులసీ మహాత్త్వం


వైశ్యకుమారా! ఏ చెట్టును నాటినా పుణ్యమే. తులసి చెట్టును నాటితే ఆ పుణ్యం వర్ణనాతీతం. తులసీ వనం ఏ పెంచిన వారు యముణ్ని లెక్క చెయ్యదు. అది సర్వపాపహరం. సర్వవాంఛా ప్రదం, తులసీవనం కానీ తులసీ మొక్క గానీ ఏ ఇంట ఉంటే ఆ ఇల్లే ఒక పవిత్ర తీర్ధం. మేము యమదూతలం ఆ ఇంటి ఛాయలకు పోవాలన్నా భయపడతాం. తులసి మొక్కను నాటినవారు దాని గింజలూ ఆకులూ ఎన్ని ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు దేవలోకంలో నివసిస్తారు. తులసీ పరిమళం సోకితే పితృదేవతలు సంతోషిస్తారు. గరుడ వాహనాధిరూఢులై విష్ణు లోకం చేరుకుంటారు. నర్మదా దర్శనం. గంగాస్నానం, తులసీదళ సంస్పర్శనం- ఇవి మూడూ పావనకరణ శక్తిలో ఒక కక్ష్యకు చెందినవి. తులసిని నాటినా, పెంచినా, నీరుంచినా, దర్శించినా, స్పృశించినా మానవులకు వాజ్ఞ్మనః కాయ సంచితాలైన సకల పాపాలు నశించిపోతాయి. శుక్లపక్షంలోగానీ, కృష్ణపక్షంలోగానీ తులసీ దళాన్ని పరమేశ్వరుడికి దానమిస్తే ఆ పుణ్య ఫలానికి మరింక ఏదీ సాటిరాదు. పిప్పుల తరువులు నూరు నాటితే ఆమ్ర వనాలు వెయ్యిపెంచితే వచ్చే పుణ్య ఫలం ఒక్క తులసిని నాటిన పుణ్యాత్ముడు శతాయుతయుగాలు నాకలోకంలో సుఖ సంతోషాలు అనుభవిస్తాడు. తులసీ దళాలతో హరిహరార్చన చేసిన భక్తుడు మరింక గర్భావాస క్లేశం అనుభవించడు. అపునర్భవమైన ముక్తిని పొందుతాడు. పుష్కరాది సకల తీర్ధాలు, గంగాది సమస్త పుణ్యనదులూ వాసు దేవాది సర్వదేవతలూ ఒక్క తులసీ దళంలో ఉండటం అపూర్వమైన విషయం (విశేషం).


No comments:

Post a Comment