Sunday 18 June 2023

శ్రీదత్త పురాణము (172)

 


తులసిని స్వయంగా నాటి నీరు పోషించి ఆ తులసీ దళాలతో శ్రీ హరిని అర్చించిన పుణ్యాత్ములు బ్రహ్మ లోకంలో నిత్య నివాసం పొందుతారు. అంతటిది తులసీ మహిమ. ఇక శివలింగార్చనా మహిమ వివరిస్తాను, తెలుసుకో.


అతిథిపూజ - సదాచారాలు


దేవతల్ని బ్రాహ్మణుల్ని, అతిధుల్నీ నిత్యమూ సంతోష పెట్టేవారు. బ్రహ్మలోక నివాసం పొందుతారు. మూర్ఖుడో, పండితుడో, శ్రోత్రియుడో, పతితుడో ఎవడైనా కానీ గాక - మధ్యాహ్న వేళ ఇంటికి వచ్చిన అతిధి సాక్షాత్తూ బ్రహ్మదేవుడితో సమానం.


కాలిబాటను నడిచి నడిచి అలసిపోయి ఆకొన్న విప్రుడికి గానీ మరొకడికి గానీ అన్నపానీయాలు అందించిన వ్యక్తి అమరలోకంలో చిర నివాసం పొందడం ఖాయం. బాటసారులై వచ్చి ఎవరెవరో అపరిచితులు ఎవరి ఇంట ఆకలిదప్పులు తీర్చుకొని తృప్తిగా పెడతారో ఆ గృహస్తు తనకు బ్రహ్మలోక నివాసాన్ని ఖాయం చేసుకున్నట్లు, మధ్యాహ్నం కానీ సాయంకాలంగానీ భోజనవేళ ఇంటికి వచ్చిన అతిధికి చిన్న బుచ్చుకొని తిరిగి వెళ్ళవలసిన దుఃస్థితి కలిగించని గృహమేధికి మా యమలోకం వైపు రావలసిన పనే ఉండదు. లేదు లేదు అనే పలుకు విని రిక్త హస్తాలతో - తిరిగివెడుతున్న అతిధి ఆ ఇంటి నుండి జన్మ జన్మార్జితాలైన పుణ్యాలను తీసుకుపోతున్నాడని గ్రహించు.


అతిధి పూజా ప్రభావం వల్ల బ్రహ్మలోకాన్ని అందుకున్న రాజులూ ముని రాజులూ ఎంతోమంది ఉన్నారు. సారాంశంగా చెప్పాలంటే అతిధికి సాటి వచ్చే బంధువులేడు. అతిధికి సాటి వచ్చే ధనం లేదు. అతిధికి సాటి వచ్చే ధర్మం లేదు. అతిధికి సాటివచ్చే హితుడు లేడు. జన్మకి ఒక శివరాత్రి అన్నట్లు జీవితం ముగిసే లోగా ఏదో ఒక పూట ఎవడో ఒక అతిధికి ప్రమాదవశాత్తూనైనా సరే ఇంత భోజనం పెట్టిన గృహస్థు యమలోకానికి బురిడీ కొట్టినట్లే.


పది మందికి అన్నంపెట్టిన వాడు ధగ ధగలాడే దివ్య విమానాల్లో అమృతం ఆరగిస్తాడు. పుణ్య ఫలానికి సరిపడా స్వర్గభోగాలు అనుభవించి అటుపైన స్వర్గ చ్యుతుడై ఉత్తర కురు భూముల్లో భారత వర్షంలో సత్కులంలో జన్మిస్తాడు. వంశ కర్త అవుతాడు. వైశ్య కుమారా భూతకోటికి ప్రాణాలు అన్నంలో ఉన్నాయి. అంచేత అన్న దాత అంటే ప్రాణ దాత అన్నమాటే.


No comments:

Post a Comment