Thursday 8 June 2023

శ్రీదత్త పురాణము (163)

 


ద్రోహాలు చేస్తాం. ఒకటేమిటి దీనికోసమని అరిషడ్ వర్గానికే ఊడిగం చేస్తాం. ఇంత చేస్తే ఇది పరమ పిశునం. పరమ కృతఘ్నం క్రూరం, క్షణికం. దగాచేసి చటుక్కున రాలిపోతుంది. ఒక్క రోజు పోషణమానితే కంపు కొడుతుంది. ఇది వాతపిత్తాదిదోషత్రయ విభూషితం. దీన్ని తృప్తి పరచడం ఎవడివల్లా కాదు. దీని కోరికలు తీర్చడం అసంభవం. దీని అహంకారం అంతా ఇంతానా? తాపత్రయ విమోహితం. నిజానికి ఇదొక చిల్లులగంప. దీని స్వభావం చాలా చిత్రంగా వుంటుంది. ధర్మాచరణం కన్నా అధర్మాచరణం అంటేనే స్వతహాగా ఇది ఇష్టపడుతుంది. దీనికున్న తృష్ణలు (కోరికలు) అబ్బో అసంఖ్యాకం. అందుకే ఇది నరక ద్వారానికి ఎప్పుడూ చేరువలో ఉంటుంది. ప్రాణవాయువు బయటకు పోగానే పురుగులు పడుతుంది. లేదా కుక్కలకీ నక్కలకీ ప్రీతి పాత్రమవుతుంది. లేదా ఇంత మట్టిగానీ పిడికెడు బూడిదగాని అవుతుంది. ఇలాంటి నశ్వరమైన ఈ శరీరానికి కనీసం మాఘస్నానమైనా లేకపోతే అది ఇంకెంత వ్యర్ధమో ఆలోచించు.


విష్ణు భక్తిలేని విప్రుడు, యోగి (భోక్తగా) లేని శ్రాద్ధం, బ్రాహ్మణుడు లేని రాచరికం, సదాచారం లేని వంశం - ఇవి నిరర్ధకాలు. దంభంతో కూడిన ధర్మం, క్రోధంతో కూడిన తపస్సు, సంశయంతో కూడిన జ్ఞానం, ప్రమాదంతో కూడిన శ్రుతం- ఇవి కూడా వ్యర్ధాలు. పతిభక్తి లేని ఇల్లాలు, స్త్రీ సాంగత్యం మరిగిన బ్రహ్మచారి, ప్రజ్వలించని అగ్నిలో వేసిన హోమం, సాక్షిలేని భుక్తి, పరపోషణలో వున్న కన్య, తన పొట్ట కోసమే చేసుకున్న వంట, శూద్ర బిక్షతో యాగం, లోభి దగ్గరున్న ధనం అభ్యాసానికి దూరమైన విద్య, శత్రుత్వాలు పెంచుకొనే రాజు, పొట్ట కూటికోసం చేసే తీర్ధయాత్రలు, వ్రతాలు; సత్య దూరమైన వాక్కు, సంధిగ్ధమైన మంత్రం పై శూన్యమైన సంభాషణం, వ్యగ్ర చిత్తమైన జనం ఇవన్నీ వృధా, వృధా. అశ్రోత్రియుడికి ఇచ్చిన దానం, నాస్తికమైన లోకాలు, శ్రద్ధలేని ఆముష్మిక కర్మలు- వ్యర్థం. అలాగే మాఘస్నానం లేని మానవజన్మ కూడా వ్యర్థం. సూర్యుడు మకరంలో ఉదయిస్తున్న వేళ మాఘస్నానం చెయ్యనివాడు  పాపాలు పోగొట్టుకోగలడా, స్వర్గం చేరుకోగలడా ? అసంభవం.

రాజా మాఘమాసంలో సూర్యోదయవేళ నదీ జలాలన్నీ పంచమహాపాతకులనూ, ఉపపాతకులనూ, చూసి-రండి, రండి. దయచేసి ఒక్కసారి మా నీటిలో మునగండి. మీ పాపాలు తొలగించుకోండి. మంచి తరుణం మించిన దొరకదు అని గొంతెత్తి పిలుస్తాయి - తెలుసా. మాఘమాసం వచ్చిందంటే సకల పాపాలూ వీడు మాఘస్నానం చేస్తాడేమో. మనకు పోయే కాలం దాపురిస్తుందేమో అని గడ గడా వణికి పోతుంటాయి. మాఘస్నానం చేసినవారు- మబ్బుల చెర వదలిన చంద్రకిరణాల్లాగా నివురు రాల్చిన నిప్పుల్లాగా పాప విముక్తులై కళ కళ లాడతారు.


మనో వాక్కాయకర్మలతో చేసిన పాపాలన్నీ అవి చిన్నవైనా పెద్దవైనా, తెలిసి చేసినవైనా, తెలియక చేసినవైనా ఆర్ధ్రాలైనా, శుష్కాలైనా మాఘస్నానంతో దగ్ధమైపోతాయి. అగ్నిలో పడిన సమిధల్లాగా హృతమైపోతాయి. రాజా ! పాపాత్ములు మాఘ మజ్జనం చేస్తే పాప విముక్తులై శుద్ధి పొందుతారు. పుణ్యాత్ములు చేస్తే సారాసరి స్వర్గం పొందుతారు. ఇందులో ఏ సందేహమూ లేదు. విష్ణు భక్తి విషయంలోలాగానే దీనికి అందరూ అధికారులే అర్హత. అనర్హత అన్న ప్రశ్నేలేదు. మాఘమాసం అందరికీ అన్నీ ఇస్తుంది. అందరి పాపాలు తొలగిస్తుంది. మాఘ స్నానమే మహామంత్రం. మాఘస్నానమే మహా తపస్సు. మాఘ స్నానమే అన్నింటికీ ప్రాయశ్చిత్తం. మాఘ స్నానమే సర్వోత్తమం. సంపారమహాకిల్బిషాలను ప్రక్షాళన చెయ్యగలిగిన ఆధ్యాత్మ జ్ఞాన కౌశల్యం శతానేక జన్మాంతర పుణ్యంవల్ల గానీ లభించదన్నారు. అలాగే మాఘస్నానం చెయ్యాలి అనే కోరిక జన్మాంతర సంస్కారం వల్లకానీ కలుగదు. పావనాలలోకెల్లా పరమ పావనం - మాఘస్నానం. సర్వ కామ్య ఫలప్రదం. ఒక్కసారి మాఘ మజ్జనం చేస్తే చాలు ఆ చంద్ర తారార్కంగా ఇహ - పరలోక భోగాలును అనుభవిస్తారు. ఈ మాఘ స్నాన ఫలాన్ని చెప్పే ఇతి హాసం ఉంది చెబుతాను ఆలకించు. 


No comments:

Post a Comment