Thursday 15 June 2023

శ్రీదత్త పురాణము (169)

 


యమదూత కృత ధర్మ ప్రభోదం


వైశ్య కుమారా! చాలా మంచి ప్రశ్న వేశావు. పాప ప్రక్షాళన కావడంతో నీ మనస్సు విశుద్ధి పొందింది. అందుకని శ్రేయోదాయకాలైన ఆలోచనలు నీకు వస్తున్నాయి. నిజానికి యమ దూతను నేను. సేవా పరాయణుడ్ని. సంభాషణలకి దిగకూడదు. కానీ అడిగావు కనుక మైత్రిని పురస్కరించుకొని నాకు తెలిసినంత వరకు చెబుతాను. గ్రహించు. పరపీడన అనేది నరక హేతువు. ఆలోచనలతో గాని పనులతో కానీ మాటలతో కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ పీడించని వారు నరకాన్ని దర్శించవలసిన పనేలేదు.


ప్రాణి హింసా పరాయణుడు ఐతే అతడు వేద వేదాంగవేత్త అయినా మహాదాత అయినా తపస్వి అయినా యజ్ఞ యాగాదులు వందలు వేలు చేసినా స్వర్గాన్ని పొందలేడు. అహింసయే పరమ ధర్మం. అహింసయే పరమ తపస్సు. అహింసయే పరమ దానం అని మునీశ్వరులు ఎప్పుడూ చెబుతుంటారు.


నల్లులు, దోమలు, చీమలు, మొదలైన అల్పజీవుల్ని సైతం ఆత్మవత్ సర్వభూతాని అన్నట్లు రక్షించే దయాళుడు. ఏనాడూ నరకం ముఖం చూడరు. సల సల మరుగుతున్న రక్తంతో యమలోకానికి అగడ్తలావున్న ప్రేత తరంగిణిని (వైతరణి) చూడ వలసిన దుర్గతి వారికి పట్టదు. అలాకాక - పొట్ట కూటికోసం జలచరాలనూ స్థల చరాలనూ హింసించే వాడు కాల సూత్ర నరకంలో పడతాడు. అక్కడ తమ మాంసాన్ని తామే భోజనం చేస్తూ క్రుళ్ళిన నెత్తురు త్రాగుతూవసాపంకంలో త్రెళ్ళుతూ ఇనుప ముట్టెల పురుగులతో హింసించబడుతూ కటిక చీకటిలో పరస్పరం చితకబాదుకుంటూ దారుణా రావాలు చేస్తూ ఒక మహా కల్పం పాటు నరక యాతనలు అనుభవించి అటు పైన భూలోకంలో స్థావరాలుగా కొన్ని యుగాలు జీవించి ఆ పైన క్రూర జంతు జన్మలు ఎత్తి చివరకు కుంటి గ్రుడ్డి కుష్టురోగి దరిద్రుడు అంగహీనుడుగా మానవజన్మ ఎత్తుతాడు. ప్రాణి పీడలకు శిక్ష ఇది. అందుచేత ఓ వైశ్య కుమారా! మనసా వాచా కర్మణా ఎవరికీ ఎన్నడూ ద్రోహం చెయ్యకూడదు. పీడ కలిగించకూడదు. ఇహ పరాలలో హితం కోరుకునే ధర్మజ్ఞుడు ఎప్పుడూ పరపీడనకు ఒడిగట్టడు. ప్రాణి హింస చెయ్యని వాడు నరకానికి భయపడవలసిన పని లేదు. సర్వ ధర్మాలకు పరాకాష్ట అహింస అనేది.


No comments:

Post a Comment