Sunday 4 June 2023

శ్రీదత్త పురాణము (159)

 


కార్తవీర్యార్జునుడు కృతజ్ఞుడై చేసిన స్తుతికి సకల దేవతా పతాక భూమి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి హృదయ-నేత్ర-వదనారవిందాలు నిండుగా వికసించాయి. ప్రేమ తొణికిసలాడే చూపులతో కటాక్షించి ఇలా పలికాడు.


రాజన్యసత్తమా ఇప్పటికి నీకు తత్వం అర్ధం అయ్యింది గదా! పరోక్షజ్ఞానం లభించింది. అపరోక్షాను భూతి కూడా కావాలి. అది కూడా కలిగిస్తాను. ఇదిగో హృద్యమూ, నిరామయమూ గూఢమూ అయిన గుహ. ఇందులోకి ప్రవేశించు. దృడాసనం వేసుకొని నడుమూ, మెడ, శిరస్సు, సమానంగా వుండేలా (నిటారుగా నిగిడించి కూర్చో, కూర్చుని నేను ఉపదేశించిన తత్వాన్ని సుస్థిరంగా చింతన చెయ్యి అక్కడ ఏ అవబోధ కలుగుతుందో ఏ సమాధి సిద్ధిస్తుందో దాన్ని చిరకాలం అనుభవించి కృతార్ధుడవు అవుదువుగాని, అని పలికి అంబుజాక్షుడు అమృతానందదాయకమైన తన దక్షిణ హస్తాన్ని అతడి శిరస్సు మీద ఆనించాడు. అతడు శిరస్సువంచి నమస్కరిస్తూ గుహలోకి ప్రవేశించాడు. పద్మాసనం వేసుకొని యధావిధిగా కూర్చున్నాడు. దత్తస్వామి ఆజ్ఞాపించినట్లు చేసాడు. చాలా తక్కువ వ్యవధిలో భగవదనుగ్రహం వల్ల సమాధి స్థితిని పొందారు. స్థాణువులా నిశ్చల శరీరుడు అయ్యాడు. పద మూడు నెలలు గడిచాయి. క్రమంగా నరభావనలోకి దిగివచ్చాడు. మెల్లగా లేచారు. గుహ నుండి వెలుపలికి వచ్చాడు. స్వామి పాదాలకు ప్రణమిల్లాడు. స్వామి అతన్ని దయార్ధంగా లేవనెత్తి ప్రేమగా పొదివి పట్టుకున్నారు. ఇద్దరూ ఏకాంతంగా సమావేశమయ్యారు. స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ ఇలా అడిగారు. నాయనా! అర్జునా! ఏటి అనుభవం చెప్పు గుర్తున్నదా? ఇంత కాలం నువ్వు సమాధిలో వున్నావు. అవ్యగమైన బుద్ధిని, పరమనైశ్చల్యాన్ని ఎలా పొందగలిగావు?


దేవా! నిన్ను ధ్యానించడం మొదలు పెట్టాను. ఆ క్షణంలోనే నా ఇంద్రియాలూ మనస్సూ చిత్తులో లయమైపోయాయి. ఆ పరమానందంలో నిమగ్నమైన నాకు ఇక త్రిపుటి భాసించలేదు. ఆ నిరుపమానానందాన్ని క్షణంలో సగంసేపు అనుభవించాను అంతే. బలీయమైన నా ప్రారబ్దం మళ్ళీ నన్ను లాక్కు వచ్చి దేహ దశకు తెచ్చింది. దయానిధీ! నాకు ఆ దివ్యానుభవాన్ని కలిగించింది నీ పాదపద్మమే తప్ప మరొకటి ఏదీ కాదు. దేవా! నీ దయవల్ల నిరాకులంగా పరమానంద సందోహం అందుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే భవాబ్దిని దాటాను. తెలుసుకోవలసింది తెలుసుకున్నాను. పొంద వలసినది పొందాను. చెయ్యవలసింది చేసాను. నాకిక వీటిలో శేషమేదీ లేదు. నా మనస్సులో హాయిగా వుంది. మళ్ళీ ఆ చిత్యుభానుభవం కోసం పరుగులు తీస్తోంది. యోగ విద్యాపారంగతా! నాకిప్పుడు రాజ్యం వున్నా ఒకటే వూడినా ఒకటే. ఉన్నది అని సుఖం లేదు. లేదని దుఃఖం లేదు. ఇది గ్రాహ్యమని ఇది ఆగ్రాహ్యమని ఏమీ అనిపించడంలేదు. అన్నీ ఒకటిగా ఉన్నాయి. దేశం - కాలం - పదార్ధం. అన్నింటా ఒకే ఒక్క చిదాత్మ కనిపిస్తోంది. నేనిప్పుడు పూర్ణానందుణ్ని అంతటా పూర్ణానందమే నిండి ఉంది. చిదానందమయం కాని పదార్ధం ఏదీ నాకు కనిపించడం లేదు. దశదిశలూ ఆనందమయాలుగా భాసిస్తున్నాయి. పరమాత్మా! అనుమతి ఇస్తే మళ్ళీ గుహలోకి ప్రవేశిస్తాను. నీ పదార్థాలను దర్శించడం నీ స్వరూపాన్ని తిలకించడం రెండూ సమానమే. అంచేత నువ్వు ఏది ఆదేశిస్తే అది చేస్తాను. నీ అనుజ్ఞ కోసం నీ ఆదేశం కోసం నిలబడ్డాను.


No comments:

Post a Comment