Sunday 25 June 2023

శ్రీదత్త పురాణము (179)

 


సాలగ్రామ మహిమ


వజ్ర కోట వినిర్మితమైన సాలగ్రామ శిలాచక్రంలో ముముక్షువులు వాసుదేవుణ్ని అర్చిస్తారు. సాలగ్రామశిల విష్ణువుకి అధిష్టానం, ఇది సర్వ పాప ప్రణాశకం, సర్వ పుణ్య ప్రదం. అందరికీ ముక్తిదాయకం. ప్రతి రోజూ సాలగ్రామ శిలా చక్రంలో శ్రీ హరిని పూజించినవారు వెయ్యి రాజసూయాలు చేసిన ఫలం పొందుతారు. అక్షరమూ అచ్యుతమూ అయిన బ్రహ్మ నిర్వాణమని వేదాంతులు చెప్పేది, సాలగ్రామ శిలార్చనంతో పుణ్యాత్ములు పొందుతారు. కాష్టంలోని వహ్ని మధనంతో బయట పడినట్లు సాలగ్రామార్చనతో మనిషిలోని పుణ్యం ఆవిష్కృతమవుతుంది. ఘోరమైన దుష్కృత్యాలు చెయ్యడం వల్ల ఏ సత్కార్మాచరణకూ అధికారంలేని మహాపాపాత్ములైనా ఒక్క సారి సాలగ్రామ సమార్చన చేస్తే వారింక మా యమాలయం వైపు రారు. సాలగ్రామ శిలాచక్రంలో నివాసమంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం. లక్ష్మీదేవితో క్రీడించడంకన్నా వైకుంఠంలో విహరించడం కన్నా ఇష్టమైన విషయం.


సాలగ్రామ శిలాచక్రంలో శ్రీ మన్నారాయణుణ్ని ఒక్కసారి అర్చిస్తే అతడు ఆహో రాత్రాలు హోమాలు చేసిన పుణ్యాన్ని చతుస్సాగర సమేతంగా భూగోళాన్ని అంతటిని దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. వికుండలా! సాలగ్రామ శిలలు పన్నెండువున్నాయి. వీటిని ఒక్కసారి అర్చిస్తే వచ్చే పుణ్యం ఎంతటిదో వివరిస్తాను. విను. స్వర్ణ కమలాలతో కోటి ద్వాదశ లింగాలను పన్నెండు కల్పాల పర్యంతం అర్చిస్తే ఏ ఫలం వస్తుందో అది ఒక్క రోజున ద్వాదశ సాలగ్రామాలను అర్చిస్తే లభిస్తుంది. ఈ ఫలం పొందిన పుణ్యశీలి విష్ణులోకంలో పన్నెండు కల్పాల పర్యంతం నివసించి అటుపైని భూగోళం మీద చక్రవర్తిగా అవతరిస్తాడు. అరిషడ్ వర్గాలకు దాసుడైన నరాధముడు సైతం సాలగ్రామ శిలార్చన చేస్తే వైకుంఠ నివాసం పొందుతాడు. సదాచార సంపన్నుడై సాలగ్రామ శిలా చక్రంలో గోవిందుణ్ని అర్చించిన సజ్జనుడు మహాప్రళయం వరకూ వైకుంఠం నుండి చ్యుతిని పొందడు. తీర్ధయాత్రలు చెయ్యకపోయినా దాన ధర్మాలు చెయ్యకపోయినా యజ్ఞాలు యాగాలు చెయ్యకపోయినా సాలగ్రామ శిలార్చన చేస్తే చాలు ముక్తి లభించడం తథ్యం. సకల పాపాలకు ఇది విరుగుడు. నరక నివాసం గర్భవాస క్లేశం (పునర్జన్మ) క్రిమి కీటక, పశు పక్షి నీచ జన్మలు వగైరా తీవ్ర శిక్షల్ని త్రోసిరాజు అనగల్గినది ఈ సాలగ్రామ శిలార్చన, దీక్షా స్వీకారంతో మంత్ర పూర్వకంగా ఈ శిలా చక్రంలో చక్రిని అర్చించి బలి ప్రధానం చేసినవాడు విష్ణులోకంలో శాశ్వత నివాసం పొందుతాడు. ఇది ముమ్మాటికీ నిజం. సాలగ్రామ శిలాజలంతో కేశవుడికి అభిషేకం జేసి ఆ పావనోదకాన్ని శిరస్సున జల్లుకొన్న భక్తుడు సకల పుణ్య తీర్థాలలోనూ స్నానం చేసిన పవిత్రతనూ, సర్వ యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని క్షణంలో నిస్సందేహంగా పొందుతాడు. ఎందుకంటే ముక్తిదాయకాలైన గంగా గోదావరీ రేవాది నదులు సకల పుణ్య తీర్ధ సమేతాలై వచ్చి సాలగ్రామ శిలోదకంలో సన్నిధి చేస్తాయి.


No comments:

Post a Comment