Tuesday 13 June 2023

శ్రీదత్త పురాణము (168)

 


ఒక రోజు శార్దూలాన్ని వెంట తరుముతూ శ్రీ కుండలుడు ఒక కొండగుహలోకి ప్రవేశించాడు. మరో క్రూరమృగాన్ని వెంటాడుతూ వికుండలుడు వేరొక గాఢారణ్యంలోకి ప్రవేశించాడు. అంతే గుహ నుండి బయటకు రాలేదు అతను. గాధారణ్యం నుండి బయటకు రాలేదు ఇతను. అన్నదమ్ములు ఇద్దరూ ఇంక కలుసుకున్నదిలేదు. జేష్టుడు శార్దూలానికి, కనిష్టుడు సర్పజాతికి ఆహారమయి పోయారు. వింత ఏమిటంటే పాపిస్టులిద్దరూ ఒకే రాత్రి ఒకే సమయాన మృతి చెందారు. యధావిధిగా యమదూతలు వచ్చారు. బంధించి ఇద్దర్నీ యముడి సన్నిధికి తీసుకుపోయారు. యమ ధర్మరాజు చిత్ర గుప్తుడ్ని వీరి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. జ్యేష్టుడ్ని రౌరవ నరకంలోకీ, కనిష్టుడ్ని స్వర్గంలో వదలి రమ్మని ఆజ్ఞాపించాడు. యమ దూతలు ముందు మొదటి పని చేసారు. మధుర సంభాషణలతో రెండో వాడ్ని స్వర్గానికి తీసికొని వెళ్తున్నారు.


నాయనా! పద పద నువ్వు చేసిన పుణ్యకార్యాలకి సరిపడా స్వర్గ సుఖాలు అనుభవించుదువుగాని స్వర్గంలో వదలివస్తాం- అని వాళ్ళు బుజ్జగిస్తుంటే వికుండలుడికి పెద్ద సందేహం వచ్చింది. నేను ఏం సత్కర్మలు చేసాను చెప్మా- అని బుర్ర తడుముకున్నాడు. ఏదీ తోచలేదు. అన్నగారితో సమానంగా అన్ని పాపాలు తనూ చేసాడు. అన్నగారితో సమానంగా దుర్మరణం పాలయ్యాడు. అన్నతో సమానంగా యమదర్శనం చేసాడు. అంచేత అన్న గారితో సమానంగా రౌరవ నరకం తనకూ దక్కాలి. మరి ఈ స్వర్గ ప్రాప్తి ఏమిటీ? ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ఎంతకీ అర్ధం కాలేదు. ఎందుకొచ్చిన చింత దూతల్ని అడిగి తెలుసుకుంటే పోలే - అనిపించింది అడిగేశాడు. 


విడుండలా! తల్లి-తండ్రి- కొడుకు - భార్య- కోడలు- అన్న- తమ్ముడు - అక్కచెల్లెలు ఈ వరుసలు ఈ అనుబంధాలు పుట్టుకని బట్టి ఏర్పడతాయి. కర్మలు అనుభవించడానికి ఇవి భూమికలు - ఎక్కడెక్కడివో పక్షులు ఒక చెట్టు మీద వాలినట్లు ఒక ఇంటిలో వీరందరి కలయికానూ, వీరిలో ఎవరి కర్మ ఫలాన్ని వారే అనుభవిస్తారు తప్ప ఒకరిది ఇంకొకరు పులుముకుందామన్నా రాదు. బదలాయిద్దామంటే పోదు.


వైశ్య కుమారా! నిజం చెబుతున్నాను. ఎవడు చేసుకున్న కర్మఫలం - అది మంచిగానీ చెడు గానీ వాడు అనుభవించవలసిందే. నీ అన్నగారు మహాపాతకాలు చేసాడు. అందుకని వాటి ఫలంగా రౌరవ నరకంలో పడ్డాడు. నువ్వు ఏదో పుణ్యం చేసావు కనుకనే స్వర్గ సుఖాలు అనుభవించడానికి వెడుతున్నావు. 

No comments:

Post a Comment