Friday 16 June 2023

శ్రీదత్త పురాణము (170)

 


తిన్నగా ప్రవహించేవి వంకర టింకరగా ప్రవహించేని - నదులన్నీ కట్ట కడపటికి సముద్రంలో లీనమైనట్లు సర్వ ధర్మాలు అహింసలో సంగమిస్తున్నాయి. తన చుట్టూతా వున్న ప్రాణికోటికి తానేమీ హాని చెయ్యకుండా అభయమిచ్చినవాడు సర్వతీర్థాలలోనూ స్నానం చేసినంతటి పుణ్యాన్ని సర్వయజ్ఞాలూ ఘనంగా చేసినంతటి ఫలాన్నీ పొందుతాడు.


శాస్త్ర విహితంగా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటించే వారు యమలోకం ఛాయలకైనా పోవలసిన పని ఉండదు. బ్రహ్మచారి - గృహస్థుడు - వానప్రస్తుడు - యతి వీరంతా స్వధర్మనిరతితో జీవికసాగిస్తే చాలు. చనువుగా వెళ్ళి స్వర్గలోకం వీపెక్కి కూర్చుంటారు. వీరు జితేంద్రియులు కూడా అయితే సరాసరి బ్రహ్మలోకమే చేరుకుంటారు. ఇష్టా పూర్ణాలు నిర్వహించినవారు నిత్యమూ పంచయజ్ఞాలు చేసేవారు దయాన్వితులూ నిత్యాన్ని హోత్రులూ వీరంతా స్వర్గప్రాప్తికి అర్హులు. రణ రంగంలో శత్రువులు చుట్టుముట్టినా ఎంతటి విపత్కర పరిస్థితి దాపురించినా దీనాలాపాలు పలకని మహాశూరులు సూర్యమండల మార్గం ద్వారా శ్రీ మన్నారాయణుణ్ని చేరుకుంటారు.


వికుండలా! అనాధ స్త్రీ బాల వృద్ధ రోగి సంరక్షకులూ విప్రపోషకులూ వికలాంగ సేవా పరులూ శరణన్న వారిని కాపాడటం కోసం ప్రాణాలు వదిలిన వారూ సరాసరి స్వర్గం చేరుకుంటారు. శాశ్వతంగా అక్కడే వుంటారు. ఊబిలో కూరుకుపోతున్న ఆవునూ, రోగ పీడితుడైన విప్రుణ్ని ఉద్దరించిన పుణ్యాత్ములు అశ్వమేధుల లోకం చేరుకుంటారు. గోవులకు గడ్డీ గాదం వేసి సకల శుశ్రూషలు చేస్తూ ఏనాడు వృషభం నడిబొడ్డున ఎక్కకుండా గో సేవా పరాయణులై కాలం గడిపినవారు ఆయువు తీరాక కచ్చితంగా గోలోక వాసులవుతారు. గోవులు దాహం తీర్చుకోడానికి వీలుగా గొయ్యితవ్వి నీళ్లు పెట్టిన పుణ్యాత్ముడు ఈ లోకాన్ని కన్నెత్తి చూడకుండా స్వర్గానికి చేరుకుంటాడు.


No comments:

Post a Comment