Friday 9 June 2023

శ్రీదత్త పురాణము (164)

 


కార్తవీర్యా భృగువంశంలో ఒక బ్రాహ్మణాంగన ఉంది. ఋచీక అని పేరు. దురదృష్టవశాత్తూ బాల్యంలోనే వైధవ్యం సంప్రాప్తించింది. ఆ దుఃఖం తట్టుకోలేక ఘోరంగా తపస్సు చేసింది. వింధ్యాచలం చేరువలో ప్రవహిస్తున్న రేవావది ఒడ్డున అకరంటకం అనే క్షేత్రంలో తీవ్ర తపస్సు చేసింది. నారాయణ ధ్యాన పరాయణగా, సదాచారవతిగా, సంగ వివర్జితగా, జితేంద్రియగా, జితక్రోధగా, సత్యవాదినిగా, మిత భాషిణిగా, సుశీలగా, దానశీలగా, దేహశోషణశాలినిగా, నియమ నిష్టలతో తపస్సు సాగించింది. ఉంఛ వృత్తితో ధాన్యం గింజలు ఏరి తెచ్చుకొని వాటిని వండి అగ్ని కార్యం తీర్చుకొని పితృ- దేవతా- అతిధులకు పెట్టి షష్టకాలంలో తాను భుజించేది. కృచ్ఛ-అతి కృచ్ఛ- పారాక - తప్తకృచ్చాది వ్రతాలను ఆచరిస్తూ తపస్సు సాగిస్తోంది. మాఘ మాసం వచ్చిందంటే చాలు నర్మదా నదిలోనూ రేవాకపిల నదీ సంగమ స్థలంలోనూ నిత్యమూ స్నానాలు చేసేది. వల్కలు ధరించి స్థిర చిత్తంతో దృఢ దీక్షతో నారాయణ మహా మంత్రం జపంచేసేది. కొంత కాలానికి ఈ తపో నియమాలతో కృంగి కృశించి ఋచీక తనువు రాలిపోయింది. మాఘస్నానాల పుణ్య ఫలంవల్ల విష్ణులోకంలో నాలుగు వేల యుగాలు నివసించింది. అప్పుడు బ్రహ్మ దేవుడు సుందోపసుందుల్ని నాశనం చేయడం కోసం ఈ ఋచీకను తన సత్యలోకంలో అవతరింప జేసాడు. మాఘ స్నాన పుణ్య శేషంవల్ల సౌందర్యరాశిగా దేవతా సమ్మోహినిగా అప్సరాంగనా శిరోమణిగా బ్రహ్మలోకంలో అవతరించింది. బ్రహ్మ సంబరపడి తన పన్నాగం నెరవేరుతుందని గ్రహించాడు. మృగశాబ్దాక్షీ! దైత్యున్ని నాశనం చెయ్యాలి. వెంటనే బయలుదేరు - అని ఆజ్ఞాపించాడు.


తిలోత్తమ వీణాపాణియై బ్రహ్మలోకం నుండి ఆకాశ మార్గాన బయలు దేరింది. దేవతా శత్రువులైన ఆ దైత్యులున్న ప్రాంతానికి చేరుకుంది. అది రేవానది అవతలి తీరం. సుందోపసుందులు అక్కడ విడిది చేసి యున్నారు. ఆ గుడారాలకు అల్లంత దూరాన రేవానదికి ఎగువన అశోకవనం ఉంది. అక్కడ తాను దిగింది. దిగుతూనే ఒక కంకేళీ తరుమూలం దగ్గర వీణను ఉంచి తాను నదీ స్నానానికి దూకింది. ఈతలు కొడుతూ ఆనందంగా ఉత్సాహంగా చాలాసేపు జలకాలు ఆడింది. ఆమె తనూ పరిమళాలు నీటిలో కరిగి దిగువకు ప్రవహించాయి.


No comments:

Post a Comment