Sunday 11 June 2023

శ్రీదత్త పురాణము (166)

 


బ్రహ్మ సంతోషించి చంద్ర ముఖీ! నీకు సూర్యరథంలో స్థానం కల్పిస్తున్నాను. ఆకాశంలో సూర్యుడు ఉన్నంత కాలం నువ్వు సూర్యలోకంలో సమస్త భోగాలను అనుభవించు అని వరం ప్రసాదించాడు.


కార్తవీర్యా! ఆ బ్రాహ్మణి ఋచీక మాఘస్నాన పుణ్యం వల్ల అప్సరోవరాంగనయై తిలోత్తమగా దేవ కార్యం నిర్వహించి అటుపైన అతి దుర్లభమైన సూర్యలోకంలో ఇష్ట భోగాలు ఇప్పటికీ అనుభవిస్తుంది. అందుచేత అందరూ ప్రయత్న పూర్వకంగా శ్రద్ధగా మాఘస్నానాలు చెయ్యాలి. సకల పురుషార్ధాలు సిద్ధిస్తాయి. సకల పాతకాలు నశిస్తాయి.


నదీ తీరంలో చేసిన మాఘస్నానానికి నువ్వు చేసే కోటి యజ్ఞాలు కూడా సాటి రావు.


హేమకుండలోపాఖ్యానం


కార్తవీర్యార్జునా! మాఘ స్నానమహిమ తెలిసింది గదా! నీకిప్పుడు అత్యంత పురాతనమైన మరొక వృత్తాంతం చెబుతాను. సదాచారాలను వాటిని ఆచరిస్తే కలిగే పుణ్యాలనూ ఆచరించనందువల్ల వచ్చిపడే అనర్ధాలును అన్నీ ఇందులో ప్రస్తావనకు వస్తాయి. కృతయుగం నాటి మాట ఇది.


నైషదమహానగరంలో హేమకుండలుడు అనే వైశ్యుడు వుండేవాడు. కుబేరుడితో సాటి వచ్చే సంపన్నుడు. సత్కులీనుడు. విప్ర-అగ్ని దేవతా పూజలు తప్పక చేసే అలవాటు ఉన్నవాడు. కృషి-వాణిజ్యమూ అతడి ప్రధానవృత్తులు. గోవుల్నీ, గుర్రాల్ని, మహిషాల్ని, కొనడం బాగా పెంచడం ఎక్కువ సొమ్ముకి అమ్మడంతో బాగా ఆర్జించాడు. పాలు, పెరుగు, మజ్జిగ, గడ్డీ, గాదం, కట్టెలు, కందమూల ఫలాలు, ఉప్పు, జాజికాయలు, పిప్పళ్ళు, రకరకాల ధాన్యాలు కూరగాయలూ, వంటనూనెలూ, వస్త్రాలూ, ధాతువులూ, బెల్లమూ, కలకండ వంటి చెరకు ఉత్పత్తులు - ఒకటేమిటి అన్నింటినీ క్రయవిక్రయాలు చేసేవాడు. లాభాలు బాగా గడించేవాడు. ఎనిమిదికోట్ల సువర్ణ టంకాలు నిలువజేసాడు. సంపన్నులలోకెల్లా సంపన్నుడయ్యాడు. అమ్మడం కొనడం, లాభాలు గడించడం.


No comments:

Post a Comment