Tuesday 20 June 2023

శ్రీదత్త పురాణము (174)

 

యధావిధిగా తిలపాత్రను దానంచేస్తే ఆ దాతకు దుస్వప్న దుష్ట ఫలాలు కానీ దుష్ట చింతనలు కానీ అంటవు. యమభయం ఉండదు. లోకంలో ప్రసిద్ధంగా షోడశమహాదానాలు ఉన్నాయి. 1) తులా పురుషదానం 2) హిరణ్య గర్భదానం 3) బ్రహ్మాండ దానం 4) కల్పవృక్షదానం 5) గోసహస్రదానం 6) కామధేనుదానం 7) హిరణ్యాశ్వదానం 8) హిరణ్యాశ్వరధ దానం 9) హేమగజదానం 10) పంచలాంగల దానం 11) ధరాదానం 12) విశ్వచక్ర దానం 13) కల్పలతాదానం 14) సప్తసాగర దానం 15) రసధేను దానం 16) మహాభూత ఘటదానం. వీటిలో ఏ ఒక్కదానం చేసినా రౌరవ నరకం నుండి తప్పించుకోవచ్చు. మంచిరోజుల్లో గానీ సంక్రమణ సమయాల్లో గానీ వ్యతీపాత వేళల్లో గానీ స్నాన జపహోమాలు చేసిన వారికి సుగతులే కానీ దుర్గతులు ఉండవు. దాతలు ఇటు మా నరకం వైపు రావడం అసంభవం. అలాగే - వారి పునర్జన్మలు సంపన్నుల భవనాల్లో తప్ప, ధన హీనుల కొంపల్లో పడరు.


పత్యవాదులూ, మితభాషులు, అక్రోధనలూ, క్షమాశీలురూ, నీతిశాలురూ, అసూయా రహితులూ, దాక్షిణ్య సంపన్నులు, భూత దయాపరులూ, పరదోష గోపనులూ, పరగుణ ప్రశంసకులూ, పరుల సొమ్ము గడ్డిపరకైనా ఆశించనివారూ యమలోకానికి రారంటే రారు. ఇతరుల మీద ఉత్తినే లేనిపోని నిందలు మోపే వాడికన్నా మహాపాపిష్టి మరొకడు ఉండడు. వీడు మహా ప్రళయం వచ్చి సృష్టి అంతమయ్యేంత వరకూ అసి పత్ర - రౌరవాది ఘోర నరకాలలో యమయాతనలు అనుభవిస్తునే ఉంటాడు.


వాక్పారుష్యం ఉన్న వాడు నిస్సందేహంగా నిరయానికి (నరకానికి) పోతాడు. అటుపైన దుర్గతులు (కుత్సిత జన్మలు) పొందుతాడు. వణిక్ శ్రేష్టా! పాపాలు అన్నింటిలోకి కృతఘ్నత అనేది మహాదారుణమైన పాపం. ఎన్ని తీర్ధయాత్రలు చేయనీ ఎంతలేసి ఒప్పులు చెయ్యనీ కృతఘ్నుడికి నిష్కృతిలేదు. చిరకాలం నరకంలో ఘోరయాతనలు అనుభవించవలసిందే.


జితేంద్రియుడై జితాహారుడై పవిత్ర నదీ తీర్థాలలో పుణ్యస్నానాలు చేసిన పావనశీలుడికి మాలోకం వైపు రావలసిన పని ఏముంటుంది చెప్పు, మిత్రమా! తీర్ధాలలో మునకలు వెయ్యకపోతే మానే, అక్కడకు వెళ్ళి పాతకాలు మాత్రం చేయరాదు. తీర్ధపజీవనం మహాపాతకం. గ్రుంకులాడటానికి వచ్చిన వాళ్ళ మీద తాను బ్రతకడం. ఇది పనికి రాదు. తీర్థాలలో దానాలు పట్టరాదు. ధర్మాన్ని అమ్ముకోరాదు. తీర్ధంలో చేసిన పాపమైనా ప్రతి గ్రహమైనా దుర్దరమే. అంటే- ఏ ప్రాయశ్చిత్తంతోనూ తొలగించుకోడానికి శక్యంకానిది. అందుచేత తీర్థాలలో మరీ జాగరూకుడై వుండాలి మానవుడు. పుణ్యం మాట దేవుడెరుగు ముందు పాపం మూటగట్టుకొని తెచ్చుకోకుండా ఉంటే చాలు. అదే పదివేలు. కానీ నేస్తమా! గంగాస్నానం ఉన్నదే అది చాలా గొప్పది. గంగా తీరాలలో ఏ తీర్ధంలో మునిగినా ఒక్కమునకంటే ఒక్క మునక చాలు జన్మజన్మార్జితాలైన సకల పాపాలు ప్రక్షాళన అయిపోతాయి. మనుసులు పూర్తిగా పరిపూతులైపోతారు. - అంతే కాదు మిగిలిన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా వారికి ఏదోషమూ అంటదు. వారు నరకం ఛాయలకైనా రావలసిన అవసరం ఉండదు.


No comments:

Post a Comment