Tuesday 27 June 2023

శ్రీదత్త పురాణము (181)

 



యోగ్యుడైన బ్రాహ్మణుడికి సాలగ్రామం దానంచేస్తే నదీ సముద్రకాననాద్రి సహితంగా సమస్త భూగోళాన్ని దానం చేసినట్లే. అంతటి పుణ్యం దక్కుతుంది. ఈ సాలగ్రామ శిలకు మూల్యం కట్టడం కానీ క్రయవిక్రయాలు జరపడం కానీ అలాంటి వాటిని ఆమోదించడం గానీ అసలైనదా నకిలీదా అని పరీక్షించడంగానీ - ఇవ్వి మహాపాపాలు. శాశ్వత నరక హేతువులు. అందుచేత ఇలాంటి పనుల్ని ఎప్పుడూ ఎన్నడూ ఎవ్వడూ చెయ్యకూడదు.


పాప భీతి ఉన్నవారు వాసుదేవుణ్ని స్మరించడం మంచిది. అది సర్వపాపహరం. ఘోరారణ్యాల్లో కఠోర నియమాలతో సంవత్సరాల పాటు తపస్సులు చెయ్యడం కన్నా త్రికరణ శుద్ధిగా గోవింద నామస్మరణ చెయ్యడం చాలా తేలిక, పుణ్య ఫలాన్ని ఇవ్వడంలో ఇవి రెండూ సమానమే కనుక ఈ మాట చెబుతున్నాను. అదనంగా ఇంకొక విశేషం ఏమిటంటే ఎన్ని పాపాలు అన్నా చెయ్యి, ఒక్కసారి ఏకాగ్రచిత్తంతో హరి నామం స్మరించు, నువ్వు మా నరకానికి వస్తే ఒట్టు. సర్వ తీర్ధ స్నాన ఫలం సర్వదేవాలయ సందర్శన ఫలం - సమస్తమూ విష్ణు నామ సంకీర్తనతో తంగేటి జున్ను అవుతుంది. వారికి యమదర్శన మహాభాగ్యం గానీ నరక నివాస మహా సౌఖ్యంగానీ ఏ మాత్రమూ దక్కవు. నాయనా? వికుండలా! నేను వైష్ణవుణ్ని పరమభాగవతోత్తముణ్ని అని ఎవరైనా అహంకరించి శివనింద చేస్తే వారికి విష్ణులోకం దక్కదు సరికదా సరాసరి ఈ నరకానికి వచ్చి మా పాల పడతారు. రాకరాక ఒక వైష్ణవుడు వచ్చాడని మా వాళ్ళు కుమ్ముకుంటారు.


ఏకాదశి మహిమ


వికుండలా! మా ప్రభువు యమధర్మరాజుల వారు చెప్పిన మరొక విశేషం నీ చెవిన వేస్తాను. గ్రహించు. ఏకాదశి అంటే పద్మనాభుడికి చాలా ఇష్టమైన రోజు. ఆనాడు తెలిసో తెలియకో కావాలని కానీ తప్పనిసరియై కానీ, ఉపవాసం ఉన్న మానవుడు మా యమలోకం దరిదాపులకు ఏనాడూ రాడట. ఇంతటి పావనమైన రోజు ముల్లోకాల్లో మరొకటి లేదని ఘంటా పధంగా చెప్పారు. ఈ పద్మనాభైకాదశి నాడు ఉపవాసం చెయ్యనంత వరకే జీవుడు ఈ పాపిష్టి, శరీరంలో బంధీగా వుండడం. ఉపవాసం చేస్తే చాలు ముక్తి లభించినట్లే. మిత్రమా! దీన్నే హరివాసరం అంటారు. వెయ్యి అశ్వమేధాలు, నూరు రాజసూయాలు ఒక్క ఏకాదశి ఉపవాసంలో పదహారోవంతుకైనా సాటి రావంటే అతిశయోక్తికాదు. ఏకాదశేయింద్రియాలతో చేసిన పాపాలన్నీ ఏకాదశ్యుపవాసంతో హరించుకుపోతాయి. అంచేత ఈ ఉపవాస వ్రతంతో సాటి వచ్చేది మరొకటి లేదంటే లేదు. కావాలని చెయ్యకపోయినా, ఏ వ్యాజంతో చేసినా ఇది పుణ్యప్రదమే. ఇది స్వర్గదాయిని, మోక్ష కారిణి. శరీరారోగ్య ప్రదాయిని. సుకళత్రదాయిని. జీవత్పుత్ర ప్రదాయిని. ఈ హరివాసరానికి గంగా, గయా, కాశీ పుష్కర కురుక్షేత్రాది పుణ్యతీర్దాలు ఏవీ సాటి రావు. ఆయాచోట్ల చేసే పుణ్య కార్యాలకన్నా అధికపుణ్య ప్రదం ఈ హరివాసరోపవాస వ్రతం, పగలంతా ఉపవశించి రాత్రి జాగరణం చేస్తే చాలు అనాయాసంగా వైకుంఠం దక్కుతుంది ఈ వ్రతంలో. అంతే కాదు ఇది చేసిన వ్యక్తి - తల్లి వైపున పది తరాలునూ తండ్రి వైపున పది తరాలనూ తన వాళ్ళు పది మందినీ ఉద్దరించిన వాడవుతాడు. తరింపజేసిన వాడవుతాడు.


అలా ఉద్దరించబడ్డ వారంతా గరుడ కేతనులై వనమాలికా భూషితులై పీతాంబర ధారులై వైకుంఠం చేరుకుంటారు.


No comments:

Post a Comment