Wednesday 14 June 2023

శ్రీదత్త పురాణము (168)



యమదూతోత్తమా! నువ్వు చెప్పేది నిజమే. ఒప్పుకుంటాను. కానీ చిన్నప్పట్నించీ నేను పాపాలు తప్ప ఒక్కటంటే ఒక్కటైనా పుణ్య కార్యం అయినా చేసి ఎరుగను. నా మనస్సు సత్కర్మలకు ఇష్టపడదు. ఈ జన్మలో నేను చేసిన వన్నీ పాపకార్యాలే. ఏ సుకృతం చేసానో ఎంతకీ తోచడం లేదు. నీకు గనుక తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకో.


వికుండలా! నువ్వు చేసిన సుకృతం నీకు తెలీదు. నాకు తెలుసు. చెబుతాను విను. ఒకనాడు నీవు క్రూర జంతువును వేటాడుతూ గాఢారణ్యంలోకి వెళ్ళావు. మళ్ళీ నీ అన్నగారిని కలుసుకోలేదు. గుర్తుందా? గాధారణ్యంలో తిరుగుతూ యమునా నదికి దక్షిణం ఒడ్డున సుమిత్రుడు ఆశ్రమంలోకి వెళ్ళావు. అతడు హరిమిత్రుడి కొడుకు. వేద వేదాంగ పారంగతుడు. బ్రహ్మ జ్ఞాని, జితేంద్రియుడు. ఆ పుణ్య ప్రదమైన ఆశ్రమంలో ఆ మహానుభావుడితో నీవు సఖ్యం చేసావు. అని మాఘమాసం చివరి రోజులు, సత్సాంగత్య ప్రభావంతో నువ్వు ఆ రెండు నాళ్ళు మాఘ స్నానాలు చేసావు, యమునా నదిలో కాళిందీ పుణ్య జలాలలో పాప ప్రణాశని అనే సార్ధక నామ ధేయం గల రేవులో (తీర్ధం) నువ్వు చేసిన మొదటి స్నానానికి సర్వపాప విముక్తి పొందావు. రెండవ మాఘ మజ్జనానికి ఫలంగా ఇదిగో స్వర్గానికి వెళ్తున్నావు. తన పాప ఫలాన్ని నరకంలో నీ అన్న అనుభవిస్తుంటే నీ పుణ్య ఫలాన్ని స్వర్గంలో నువ్వు పొందు. అక్కడ నీకు ఏ సుఖాలు దక్కుతాయో చెప్ప లేను గానీ నీ అన్న మాత్రం - కత్తికోతలు - రుచిచూస్తాడు. గదా ఘాతాలకు బలి అవుతాడు. బండ శిలల క్రింద నలుగుతాడు- కణ కణ లాడే నిప్పుల్లో పొర్లుతాడు.


యమ దూత చెబుతూంటే వికుండలుడి మనస్సు విల విల లాడింది. అయ్యో! అన్నయ్యా! నరక యాతనలు అనుభవిస్తావా అని మూగగా రోదించాడు. ఎవడి కర్మ వాడు అనుభవించవలసిందే. గుర్తుకి వచ్చింది. వెంటనే తేరుకుని వినయంగా మధురంగా ఇలా అడిగాడు.


దూతవరా! ఇప్పుడు మనం మిత్రులమయ్యాం. ఏడు అడుగులు కలిసి నడిస్తే చాలు సజ్జనులకు మైత్రి కుదిరినట్లే కదా! మనం కలిసి ఏడడుగులు ఏమిటి చాలా దూరం నడిచాం. అదీ మధురంగా మాట్లాడుకుంటూ నడిచాం. అందుచేత మనం మిత్రులు అయ్యాం. ఈ మైత్రిని పురస్కరించుకొని అడుగుతున్నాను. అన్నీ తెలిసిన వాడివి. దయచేసి నా సంశయం తీర్చు. మానవులు ఏ కర్మలు చేస్తే యమలోకాన్ని దర్శించకుండా తప్పించుకుంటారు? ఏ కర్మలు చేస్తే ఏ నిరయు(నరకము)లో పడతారు? ఇది కొంచెం తెలియజెప్పు?


No comments:

Post a Comment