Monday 5 June 2023

శ్రీదత్త పురాణము (160)

 


ఇలా అడుగుతున్న కార్తవీర్యున్ని చూసి దత్తస్వామి ముసిముసి నవ్వులు నవ్వుతూ నాయనా కుమారా! స్నానం చెయ్యి. నిత్య విధులు ఆచరించు. ఆహారం తీసుకో, రేపు మళ్ళీ సమాధిలోకి ప్రవేశించుదువుగాని అన్నారు. అర్జునుడు అలాగే చేసి ఆ మర్నాడు దత్తస్వామి అనుమతితో గుహలో ప్రవేశించి సమాధి స్థితిని పొందాడు. ఆరునెలల మళ్ళీ దత్త గురుడి ఇచ్ఛ ప్రకారం ఇవతలకి వచ్చాడు. వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు.


తనయా! స్నానంచేయి. నిత్య విధులు ఆచరించి ఆహారం తీసుకో రేపు మళ్ళీ గుహలోకి ప్రవేశించి సమాధిలో వుండు. సంవత్సరం తరువాత మళ్లీ ఇలాగే లేచి వద్దువుగానీ- అని గురుస్వామి ఆజ్ఞాపించారు. అర్జునుడు అలాగే చేసి సరిగా ఏడాదికి సమాధి నుండి లేచి స్వామి సన్నిధికి వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. అప్పుడు భక్త వత్సలుడైన గురుస్వామి ప్రేమగా చేరబిలిచి ఎదురుగా దగ్గరగా కూర్చోబెట్టుకొని మృదువుగా ఇలా సంభాషించారు.


రాజా కృతార్ధుడవయ్యావు నీవు. నాకు చాలా ఆనందంగా వుంది, అప్పట్లో నువ్వు అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. ఒక్క దానికి మాత్రం అప్పుడు చెప్పలేదు. అది ఇప్పుడు చెబుతున్నాను. సదాచారం గురించి అడిగావు గుర్తుందా? అది చెబుతాను తెలుసుకో. నిజానికి ఇప్పుడు నీకు గానీ నాకు గానీ ఈ సదాచారం అవసరం లేదు. మనం దీనికి అతీతులం. కానీ సనాతనాలైన వర్ణాశ్రమ ధర్మాలను విడిచిపెట్ట కూడదు. అందుకోసం లోకానుగ్రహం కోసం నేను నిత్యమూ వీటిని ఆచరిస్తూ వుంటాను. అయితే - భక్త జనబాధను తప్పించుకోవడానికి అప్పుడప్పుడూ సదాచారమునకు వ్యతిరేకిగా ప్రవర్తిస్తూ వుంటాను. మదవతీ, మధ్య, మాంసాలను సేవిస్తున్నట్లు, కృశానాదులలో సంచరిస్తూవున్నట్లు కనిపిస్తాను. కానీ నాయనా! నన్ను చూసి నువ్వు ఇవి నేర్చుకోకు. సదాచారానికి భిన్నంగా ఏనాడూ ప్రవర్తించకు. గృహస్థాశ్రమానికి నిర్ణీతాలైన ధర్మాలను స్థిరంగా ఆచరించు. ఇది లోక శ్రేయస్సుకు చాలా అవసరం. ఎట్టి పరిస్థితులలోనూ అన్యధా ప్రవర్తింపకు ఎందుకంటే సమాజంలో ఉత్తముడు ఏది ఆచరిస్తే దాన్నే ఇతర జనమూ ఆదరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తే తక్కిన లోకమూ దాన్నే అనుసరిస్తుంది.


No comments:

Post a Comment