Friday 23 June 2023

శ్రీదత్త పురాణము (177)

 


ద్రవ్యం - అన్నం - తోయం - ఒకటేమిటి శివస్వం (శివుడి సొమ్ము) దేనిని అపహరించి తీసుకుపోకూడదు. శివనిర్మాల్యం దాటరాదు. శ్రద్ధగా తీసికెళ్ళి ఏదైనా కూపంలో విడిచిపెట్టాలి. లోభం వల్లగానీ, మోహం వల్లగానీ శివస్వాన్ని (శివసొమ్మును) ఈగ కాలంతైనా సొంతానికి వాడుకున్నాడంటే వాడు కల్పాంతం వరకు నరకంలో కుతకుతా.. ఉడికిపోతాడు.

 

ఆవిరి గడ్డితోగానీ, ఆకుతో గానీ, వాననీరు దిగకుండా శివాలయం నిర్మిస్తే ఆ పుణ్యాత్ములు శివ సన్నిధిలో చిరంతనంగా ఆనందానుభూతి పొందుతుంటారు. త్రిమూర్తులలో ఎవరికి ఆలయం కట్టినా మఠం కట్టినా వారు ఆ స్వామిలోకంలో స్వామి సన్నిధిలో స్థిర నివాసం పొందుతారు.

 

ధర్మ పత్రాలూ, సాధుమథాలూ, గోశాలలు, బాటసారులకు సుఖంగా దారి ప్రక్కన విశ్రాంతి మందిరాలూ, యతి సదనాలూ, దీనకుటీరాలూ, వేదాధ్యయన మందిరములూ, విప్రులకు గృహాలు నిర్మించిన దాతలు ఇంద్రలోకంలో శాశ్వత నివాసం పొంది ఇంద్ర భోగాలు అనుభవిస్తారు. వీటిని జీర్ణోద్ధరణ చేస్తే ఈ పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. అంతేగానీ - శిధిలమైన వాటిని పూర్తిగా పాడు పెట్టి కొత్తవి నిర్మించిన పుణ్యానికిపోతే పాపం ఎదురై నరకం దక్కుతుంది.

 

దేవాలయములు, విప్రగృహాలూ, యతిమఠాలూ మొదలైన వాటికి ధనలోభంతో ఆధిపత్యం చేపట్టినవాడు సర్వపాపభాజనుడు అవుతాడు. మఠాలకు సంభందించిన పత్రం, పుష్పం, ఫలం, తోయం, ద్రవ్యం అన్నం- వీటిని ఎవడైనా కాజేస్తే నరక నివాసం తప్పదు. కాబట్టి ఎవడినైనా సపుత్ర మిత్ర పశు బాంధవంగా నరకంలోకి నెట్టివెయ్యాలను కుంటే అతడికి దేవాలయ గోశాలా విప్రగృహ మఠాధిపత్యం అప్పగిస్తే సరి. మఠాధిపత్యం తన చేతిలో ఉంది గదా అని మఠాన్నాన్ని తానూ ఒక పూట భుజిస్తే ఆ దోషం చంద్రాయణ వ్రతంతో గానిపోదు. ఇలా ఏదో రకంగా చిన్నదో పెద్దదో పాపం చుట్టుకోక తప్పని పదవులు కనక వీటిలో ఉన్న వారిని స్పృశిస్తే సచేల స్నానం చెయ్యాలి. త్రిమూర్తుల అర్చనలకోసం పుష్ప వాటికలు నిర్మించినవారు దేవ లోకంలో నిత్య నివాసం పొందుతారు.


No comments:

Post a Comment