Saturday 15 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 222 వ భాగం



ఇతనికి ఉపదేశించాలని శంకరులు వెళ్ళారు. ఆనాటి కాలంలో కల్లుగీత గీసేవారికి ఒక విద్య తెలుసు. కొబ్బరి చెట్టు మొదట్లో ఒక మంత్రం చదివితే వెంటనే చెట్టు నేలకొరిగేదట. కొబ్బరికాయలను, కల్లును అట్లా సులభంగా తీసుకునేవారు. మరొక మంత్రం చదివితే లేచి నిలబడేదట.


మండనుల ఇంట్లో కొబ్బరి చెట్టు ఒకటుండేదని, ఆ వీధిలో పోతున్న కల్లుగీత గీసేవాడిని తనకా విద్య నేర్పమని అడిగారని, దానినతడు నేర్పాడని, మండన మిశ్రుల ఇంట్లో వాలేరని ఒక కథ ప్రచారంలో ఉంది. యోగశక్తి ద్వారా ప్రవేశించారని మరొక కథ.


శ్రాద్ధంలో భోక్తలుగా జైమిని మహర్షి, వ్యాసాచార్యులున్నారు. పరీక్షిత్తు ఎంత జాగరూకత వహించినా తక్షకుడు నిమ్మకాయలో దూరలేదా? అట్లాగే శంకరులూ ప్రవేశించారు. తక్షకుడు విషం కక్కడానికి వెడితే, శంకరులు అమృతాన్ని పంచడం కోసం వెళ్ళారు.


ఓ సన్యాసీ ఎక్కణ్ణుంచి వచ్చావని శ్లేషతో కూడిన ప్రశ్నలు, శంకరుల సమాధానాలు అయ్యాయి. శ్రాద్ధంలో విష్ణుస్థానంలో సన్న్యాసిని నియమించవచ్చని జైమిని, వ్యాసులన్నారు. భిక్ష స్వీకరింపుమని మండనుడు అన్నాడు.


నేను కేవలం భిక్ష కోసం రాలేదు. నాకు కావలసింది వాద భిక్ష, కుమారిలుడు పంపగా వచ్చానన్నారు. ముందీ భిక్షను గ్రహించండని తరువాత వాద భిక్షయని అన్నాడు మండనుడు.

No comments:

Post a Comment