Thursday 6 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 213 వ భాగం



శంకరులు చూసినది, మనస్సును పోగొట్టుకొన్న రాగద్వేషాలు లేని అసాధారణ పంచముణ్ణి. కాబట్టి అట్టివానిని గురువని కీర్తించారు. జాతి భేదాన్ని వద్దని శంకరులు, ఈ మనీషా పంచకంలో ప్రవచించారని అనడం సాహసం.


విశ్వనాథుని లీల


ఇక పంచముడంతర్ధానమై విశ్వనాథుడు సాక్షాత్కరించాడు. ఆచార్యులను పరీక్షించడం కోసం శంకరుడట్లా వేషం వేసుకొని వచ్చాడు. శంకరులు జ్ఞానియైనా, ఇతరులకు ఆదర్శంగా ఉండడం కోసం కొన్ని ఆచారాలను పాటించాలని, ప్రపంచ వాసనల కతీతంగా ఉన్నవారి పట్ల వినయంతో ఉండాలని, తామాచార్యులమని భావించకూడదని, అటువంటి వారికి శిష్యులుగా భావించాలని తెలివిడి చేయడం కోసం అట్లా వచ్చాడు. ఆచార్యులు శంకరుణ్ణి స్తోత్రాలతో పూజించారు. ఆచార్యులను దీవించి శంకరుడు అదృశ్యుడయ్యాడు.


కుమారిల భట్టు వృత్తాంతము 


దిగ్విజయం చేయవలసినదిగా వ్యాసుడే శంకరులతో అన్నాడు. నివృత్తి మార్గంలో నున్న శంకరులు ప్రవృత్తి మార్గంలో ఉన్న కుమారిలుని ప్రదేశానికి వెళ్ళారు. ఆనందగిరీయంలో కుమారిలుడు అపుడు ప్రయాగలో ఉన్నాడు. అది రుద్రపురం అని యుంది.


కుమారిలుడు, అద్వైత వేదాంతాన్ని అంగీకరిస్తే తన అవతార ప్రయోజనం సిద్ధించినట్లే. కానీ అతడు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడని విని వెళ్ళారు.


కుమారిలుడు బౌద్ధాన్ని ఖండించడం కోసం, వైదికునిగా వెడితే వారంగీకరించరని తాను బౌద్ధుడనని, తత్త్వం తెలిసికోవాలని బౌద్ధ విహార కేంద్రంలో ప్రవేశించాడు. అయితే అతడు వైదిక కర్మానుష్టానాలను రహస్యంగా చేస్తూ ఉండేవాడు. దీనిని బౌద్దులు పసిగట్టారు. ఇతణ్ణి భవనంలోని ఏడవ అంతస్తు నుండి త్రోసివేసారు. వేదాలే ప్రమాణమైతే తాను సురక్షితంగా బయట పదాలని అన్నారు.


No comments:

Post a Comment