Saturday 2 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 119 వ భాగం



గురు పరంపరంలో శుకుని వరకూ ఎవ్వరూ సన్యాసాశ్రమం తీసి కోలేదని. అయినా బ్రహ్మ జ్ఞానులని, ఆచార్య పురుషులని చెప్పాను.


గృహస్థాశ్రమంలో ఉంటూ కలిలో జ్ఞానోపదేశం చేయడం సబబు కాదు, అట్లాగే అతి వర్ణాశ్రమంలో కూడా. ఈ యుగంలో కొందరు అతివర్ణాశ్రములమని, మాకే నియమాలూ పట్టవని, ఆ పేరుతో అనాచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాలు బాధ కలిగిస్తున్నాయి. అట్టి వారిని చూస్తే నిందింపవలసి వస్తుంది. కలిలో అతి వర్ణాశ్రములు, గురుపరంపరలో కనబడరు. గౌడపాదులవారినుండి సన్న్యాసం నియమాల ప్రకారము తీసుకోవడం మొదలయింది.


అట్లా అని గౌడపాదుల ముందు సన్న్యాసాశ్రమం లేదనుకొనండి. వేదంలో వీటి ప్రస్తావన లేదా? వేదంలో సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తులనే విభాగాలే నాల్గు ఆశ్రమాలను సూచిస్తున్నాయని శంకర సిద్ధాంతాన్ని సరిగా అర్ధం చేసుకున్న జర్మన్ విద్వాంసుడైన పాల్ డ్యూయసన్ అన్నాడు. బృహదారణ్యకంలో భార్యను విడిచి యాజ్ఞవల్క్యుడు సన్న్యాసం పుచ్చుకోలేదా? 108 ఉపనిషత్తులలో 10 లేక 15 ఉపనిషత్తులు సన్న్యాసం గురించే ఉంటాయి. అవధూతోపనిషత్తు, సన్న్యాసోపనిషత్తు అని కూడా ఉన్నాయి. మనుస్మృతిలో తురీయాశ్రమం గురించి యుంది. ఈ ఆశ్రమం నుండే 'తురీయ' స్థితిని చేరుకోగలడని స్మృతులన్నాయి. విశ్వేశ్వర స్మృతిలో సన్న్యాసి ధర్మాలు ఉగ్గడింపబడ్డాయి. దీనిని విశ్వేశ్వర సంహిత అని కూడా అంటారు.


శంకరుల పరంపరలో గౌడపాదులు, గోవిందులు, నియమాల ప్రకారం సన్న్యాసం పుచ్చుకున్నవారే.


సన్న్యాసులలో కుటీచక, బహూదక, హంస, పరమహంసలని నాల్గు రకాలవారున్నారు. చివరి తరగతికి చెందినవారు, అద్వైత సంప్రదాయానికి చెందినవారు. వారు తిరుగుతూ ఉంటారు కనుక పరివ్రాజకులు.


No comments:

Post a Comment