Thursday 28 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 145 వ భాగం



నంబూద్రీలు త్రిసూరిని 'శివపురం అంటారు. మలయాళంలో శివపేరూర్. గౌరవవాచకమైన శ్రీని అనగా తిరు చేరిస్తే తిరు శివపేరూర్ అవుతుంది. అది కాలక్రమంలో తిరుచూర్ అయింది.


తమిళనాడులో కూడా శివపురం ఉంది. అప్పర్, జ్ఞాన సంబంధర్ అనే శివ భక్తులు అక్కడున్న దేవతామూర్తులను కీర్తించారు. అది కుంభకోణానికి మూడు మైళ్ల దూరంలో ఉంటుంది.


'ఒక మహాక్షేత్రం ఉందంటే దాని ప్రభావం ఐదు క్రోసుల వరకూ ఉంటుంది. క్రోశమనగా 2', మైళ్ళు. అనగా పది, పన్నెండు మైళ్లవరకూ ఉంటుంది. దానిని పంచ క్రోశమంటారు. ఈ శివపురం ప్రాంతలోనే సమీపంగా కుంభకోణం ఉంది. ఇక్కడ శివపురం ఉన్నట్లే మలయాళ దేశంలో కాలడిలో శివపురం ఉంది (త్రిచూర్), తమిళ ప్రాంతంనుండి అక్కడికి వెళ్ళినవారు వారి ఊళ్ళపేర్లను పెట్టుకుని సంతోషిస్తారని చెప్పాను కదా. అట్లాగే తమిళంలోని శివపురం వారు కేరళ వెళ్ళి శివపురం అని పెట్టగా అది త్రిచూర్ అయింది.


ఈ త్రిచూర్ లోనే శంకరుల తల్లిదండ్రులు స్వామిని సేవించుట, ఈశ్వరానుగ్రహం వల్ల జన్మనిచ్చుట జరిగింది.


మరొక సంబంధం ఉంది. శంకరుల తండ్రి పేరు శివ గురువు, శంకరులు శంకరావతారం గనుక తండ్రిపేరు శివగురువనడం బాగానే ఉంది. తండ్రి గురువే, ఉపదేశమిచ్చువాడూ గురువే. ఇట్లా సరిపోయింది. తల్లి, ఆర్యాంబ. శివ గురువని సాధారణంగా పేరు పెట్టుకోరు. కాని తమిళనాడులో, కుంభకోణం దగ్గర, శివపురంలో ఇట్లా పేర్లు పెట్టుకునేవారున్నారు.


తమిళనాడులోని శివపురంలో స్వామిపేరు, శివగురునాథ స్వామి. స్వామిమలైలో కుమారస్వామియే తండ్రికి ఉపదేశమిచ్చాడు. కనుక కొడుకే శివగురువయ్యాడు. కాని కేరళలో శివగురువు, శంకరావతారానికి తండ్రి అయ్యాడు. '


No comments:

Post a Comment