Monday 25 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 142 వ భాగం



శంకరులు ప్రభవించి ధర్మోద్ధరణను చేసినా రాను రాను క్షీణించిన కాలమూ ఉంది. పరశురాముడు, కొన్ని ఆచారాలను ప్రవేశపెట్టాడని చెప్పాను. బ్రాహ్మణులలో పెద్దవాడు, బ్రాహ్మణ స్త్రీని, మిగిలిన సంతానం ఇతర వర్ణ స్త్రీలను వివాహ మాడుట అందులో నొకటి.


పర్వత ప్రాంతానికి అవతలవైపు ఉండడం వల్ల, ఆనాడు రాకపోకలు తక్కువగా ఉండడం వల్ల, ఇది ఒక ప్రత్యేక సంస్కృతితో చాలాకాలముంది. అయితే ఆదీ, మొత్తం భారతీయ సంస్కృతికి భిన్నం కాదు. ఒక నదిలో అనేక స్నానఘట్టాలున్నట్లుగానే భిన్న భిన్న సంప్రదాయాలుండడం సహజం. మిగిలిన ప్రాంతాలలో సనాతన పద్ధతులు క్షీణించినా ఇక్కడ మాత్రం రక్షింపబడింది. అందువల్ల శంకరులిక్కడ అవతరించారు.


దీనికి భిన్నంగా కొన్ని మార్పులు కాలక్రమేణా చోటు చేసుకున్నాయి. ఇది సముద్ర ప్రాంతంలో ఉండడం వల్ల పాశ్చాత్య దేశాలనుండి ఇతర మతాలవారిక్కడ ప్రవేశించారు. వర్తక కేంద్రం కావడం వల్ల మిగిలిన మతస్థులు ప్రవేశానికి తావేర్పడింది. ఇట్లా యూదులు, క్రైస్తవులు, మహమ్మదీయులూ ఇందు ప్రవేశించి తరువాత మతవ్యాప్తిని చేసారు.


ఇట్లా ఇతర మతాలవారు వచ్చినా ఇక్కడి హిందువులు శంకర సంప్రదాయాన్నే పాటిస్తూ వస్తున్నారు. పద్మనాభస్వామి, గురువయ్యార్ వంటి వైష్ణవ క్షేత్రాలలో అర్చకులు వైష్ణవులు కారు. శంకర సంప్రదాయానికి చెందినవారనే మాటను గుర్తించండి.


ఒకమూల సనాతన సంప్రదాయమున్నా రాజకీయంగా కమ్యూనిష్టుల ప్రభావమూ ఇక్కడ ఉంది.


No comments:

Post a Comment