Sunday 17 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 134 వ భాగం



కొన్ని మతాలు భగవానుడు లేడనగా కొందరు భగవానుడు నిమిత్త కారణమని, అణువులచే నిర్మించాడని, అనగా అద్వైతం రెండూ ఆయనే అంటుంది.


జగత్తునకు, ఈశ్వరుడు కర్త కాదని సాంఖ్యులంటారు. ఈశ్వరుడు జ్ఞాన స్వరూపుడని అంటారు. అట్టి జ్ఞానం నుండి ఈ భౌతిక జగత్తు రాదంటారు. శంకరులే మన్నారు? భౌతిక జగత్తు చైతన్యం నుండి రాదని, భౌతిక జగత్తు శాశ్వత సత్యం కాదని, మాయవల్ల కన్పిస్తున్నట్లుందని ఇది మాయయేయని, మన కల్పనల వల్ల ఉన్నట్లుందని అంటారు. ఆ కల్పన, మన బుద్ధి నుండి వచ్చింది. ఈశ్వరునిలోని కల్పన కూడా అంతే! అతని బుద్ధినుండే అతని చైతన్యం నుండే వచ్చిందనడంలో వైరుధ్యం ఏముంది? కనుక ఈ కల్పనా ప్రపంచానికి ఈశ్వరుణ్ణి కర్తయని అంటున్నాం. పదార్థం కూడా శక్తియేయని నేటి సైన్సు అంటోంది కదా!


కలలో కొన్నిటిని చూస్తున్నాం. చూస్తున్నంతసేపూ అవి ఉన్నాయి. మెలకువ వస్తే లేవు. కలలో అవి ఎట్లా తాత్కాలికంగా ఉన్నాయో జగత్తు కూడా కొంతకాలముంటుంది. నిత్య సత్యం కాదని అంటారు. ఈ కల్పనా ప్రపంచానికి ఈశ్వరుడే కర్త అవుతున్నాడు.


మనం కర్త అనే పదాన్ని వాడగా క్రైస్తవులు కర్తర్ అంటారు. 


అది మాయయైనా కల్పనయైనా, ఈ కల్పించే వాడొకడుండాలి. కనుక కర్త, ఈశ్వరుడని, శంకరులు సాంఖ్య సిద్ధాంతాన్ని ఖండించారు. ఫలదాత ఈశ్వరుడని, జడమైన కర్మ ఫలాన్నియ్యదని, సమష్టి బుద్ధితోనున్న ఈశ్వరుడే ఎవరెవరికి ఏయే కర్మలకు తగిన ఫలాన్ని నిర్దేశించగలడని నిర్ధారించి మీమాంసకుల మతాన్ని ఖండించారు.


No comments:

Post a Comment