Saturday 9 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 126 వ భాగం



శంకరులు చాలా వినయంతో గురుస్తోత్రం చేసారు. గుర్వష్టకం వ్రాసేరు. వివేక చూడామణి గ్రంథంలో తన గురువుని నుతించారు:


"సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ్ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం"


(సద్గురుం బదులు మద్గురుం అనే పాఠం కూడా ఉంది.)


వారు పరమానంద స్వరూపులని, వారిని సమీపించడం కష్టమైనా దయతో శిష్యులనుగ్రహిస్తారని అన్నారు. ఎట్లా? వేదాంత సిద్ధాంతాన్ని, సాధన మార్గాలను చెప్పి వాటిద్వారా తన దగ్గరకు చేరునట్లు చేస్తారని చెప్పబడింది. అందుకనే ఈ శ్లోకం, సర్వ సిద్ధాంత గోచరం అని మొదలు.


ఈ శ్లోకాన్ని బట్టి ఇది ఒక మానవ మాత్రుని కాదని పరమాత్మనే సంబోధించినట్లు లేదూ?


అట్టి భావన ఉంటే మానవ గురువు యొక్క అవసరమే ఉండదు. శాస్త్రాల ప్రకారం పరమాత్మయే గురు రూపంలో వస్తాడని ఉంది. అయితే మనకొక సందేహం కల్గుతుంది. ఈయనకు పరమాత్మానుభవం ఉందా? అట్టి అనుభూతి కలిగినవాడే వీరు పేర్కొన్న గురువు వంటివారు కావాలి. బదరికాశ్రమంలో గోవిందులకు వ్యాస దర్శనమైంది. ఒక అవతార పురుషునకు నీవు గురువు కావాలని వ్యాసుడు వీరితో అన్నాడు. ఈశ్వరుని మాట వ్యాసుని ద్వారా వెలువడింది.


సంప్రదాయం ప్రకారం ఒక గురువు, ఒక శిష్యుడు ఉండాలి కనుక అవతార పురుషునికి కూడా ఒక గురువుండాలి. "నీవు కొంత దూరం అతణ్ణి వెదకడానికి వెళ్ళు, అతడు సద్గురువును వెదుకుతూ వస్తాడు. భారతదేశం మధ్యలో నర్మదాతీరం ఉంది. అక్కడ ఇద్దరి సమాగమమని" వ్యాసుని తీర్పు. అపుడు వ్యాసుడే కాదు, శుకుడు, గౌడపాదులు, గోవిందులు అందరూ కలిసే యున్నారు. అది ఒక రకమైన Round Table Conference.


No comments:

Post a Comment