Monday 18 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 135 వ భాగం



ఇట్లా భగవంతుడున్నాడని, ప్రజలలో భక్తిని పాదుకొలిపి, వైదిక కర్మలను ప్రోత్సహించి, క్రూరాచారాలను ఖండించి వైదిక మతాన్ని దృఢతరం చేసారు.


ఆనాడు తాంత్రికాచారాలుండేవి. 64 తంత్రాలు ఉండేవని, 'చతుష్షష్ట్యా తంత్రైః' అని సౌందర్యలహరిలో (31 శ్లో) అన్నారు. ఒక్కొక్క తంత్రానికి ఒక్కొక్క దేవత. దీనిని ఆగమమని అంటారు కూడా. వైదిక ధర్మానికి దూరంగా ఉంటే వీటిని నమ్మనవసరం లేదని శంకరులన్నారు. వేద సమ్మతాలనే స్వీకరించండన్నారు. ఇందు కౌల మార్గమని, మిశ్రమార్గమని, సమయ మార్గమని ఉన్నాయి. ఇందు కౌలం స్వతంత్రమైనది. మిశ్రమార్గంలో అక్కడక్కడా వైదికాచారాలుంటాయి. సమయ మార్గం మాత్రం వైదిక పద్ధతిలో ఉంటుంది. దీనిని శంకరులు సమర్ధించారు.


శంకరులు తరువాత ఉదయనాచార్యులు వచ్చి, భగవంతుడున్నాడని బౌద్ధులను గట్టిగా ఎదుర్కొన్నారు. వారి న్యాయ కుసుమాంజలి ప్రసిద్ధం. శంకరుల పనిని పూర్తిగా నెరవేర్చినవారు వీరే.


శంకరుల వర్గీకరణం


కర్మానుష్ఠానాన్ని స్థాపించడంలో కుమారిలునిది ప్రధాన పాత్ర. బౌద్ధాన్ని వారీ విషయంలో ఎదుర్కొన్నారు. శంకరుల దృష్టిలో కర్మ, ప్రాథమిక మైనది. ఇది చిత్త శుద్ధికి తోడ్పడేది. తరువాత జ్ఞాన విచారం చేయాలని దానివల్లనే మోక్షమని ప్రతిపాదించారు. ఇది ప్రాథమికం కాదని, జీవితాంతం కర్మానుష్ఠానమని కుమారిలుని సిద్ధాంతం. జ్ఞాన విచారణ అక్కర్లేదని దీనివల్లనే మోక్షమని గట్టిగా నమ్మారు. కనుక బౌద్ధుల నెదుర్కొనడంలో, కర్మానుష్ఠానం విషయంలో శంకరుల పాత్ర కంటే వీరి పాత్ర ఎక్కువ. జైమిని సూత్రాలకు శబరస్వామి భాష్యం వ్రాయగా దానికి వీరు వ్రాసిన వార్తికంలో అనేక ఉపపత్తులను చూపించి బౌద్ధులను ఢీకొన్నారు.


No comments:

Post a Comment