Wednesday 6 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 123 వ భాగం



కనుక శంకర నామంలోనే శంకరుల శక్తి ఇమిడి యుంది. శరీరం లేకపోవచ్చు. జయ జయ శంకర, హర హర శంకర అంటే చాలు. ఇట్టి తన పేరే ఇతరులకు స్ఫూర్తిని, రక్షణను కల్గిస్తుందని తరువాత వారీ పేరుతోనే ఉండవచ్చని భావించారేమో! అర్హత, లేకపోయినా ఆ పదం అర్హతను సంపాదించి పెడుతుందని సమాధానం చెప్పుకున్నాను. అనుయాయులచే ధర్మ ప్రబోధం చేయించాలని వారి సంకల్పం.


వారి నామాన్ని ధరిస్తే వారి శక్తిని ధరించగలమా? వారి నామమే అట్టి శక్తినిస్తుందని సమాధానం. నీరసంగా ఉన్నవాడు, బలమైన మందును తీసుకొంటే నీరసాన్ని పోగొట్టడానికే అని సమాధానం.


రామానుజులతో పోలిక


శంకరులకు, రామానుజులకు కొన్ని పోలికలున్నాయి. అద్వైతానికి పూర్తిగా విరుద్ధం ద్వైతం. విశిష్టాద్వైతం అట్టిది కాదు. అయితే విధి విధానాలు భిన్నం. మధ్వ సంప్రదాయంలో బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్న్యాస స్వీకారం. శిఖాయజ్ఞోపవీతాలుండవు. రామానుజ సంప్రదాయంలోని సన్న్యాసులకు ఇవి యుంటాయి. గృహస్థాశ్రమం నుండి సన్న్యాసం తీసుకుంటారు. మన సంప్రదాయంలో ఏకదండి సన్న్యాసులుంటే వారు త్రిదండి సన్న్యాసులు.


శంకరులు, మధ్వాచార్యులు మఠాలను స్థాపించారు. రామానుజులు స్థాపించలేదు. వీరిలో 72 సింహాసనాధిపతులున్నారు. అందులో సన్న్యాసి మఠం అనే వ్యవస్థ ఉండదు. వైష్ణవ సంప్రదాయం, గృహస్థ పరంపర వల్ల వృద్ధి పొందింది.


శంకర సంప్రదాయంలోని సన్యాసులు 'దశనామి' అనే వర్గం లోనివారు ఈ వర్గంలోనిదే, మధ్వాచార్యులు గ్రహించిన తీర్థ సంప్రదాయం. వారి సన్న్యాస నామం ఆనందతీర్థ. కృష్ణ చైతన్యులు ఈశ్వరపురి అనేవారినుంచి దీక్ష స్వీకరించారు. భారతి, పురి అనేవి కూడా దశనామి వర్గంలోనివే. రామకృష్ణ పరమహంసగారు, 'పురి' సన్న్యాసి నుండి ఆశ్రమాన్ని స్వీకరించారు. వారే తోతాపురి.


No comments:

Post a Comment