Saturday 16 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 133 వ భాగం



భగవంతుడున్నాడనుట


అందరూ భక్తికి మ్రొగ్గు చూపుతారు. ప్రతిదీ కారణకార్యాలతో ముడిపడి యుంటుంది కనుక దీనికంతటికీ ఒక కారణమైన ఈశ్వరుడున్నాడని చాలామంది నమ్ముతారు. అట్టిది లేదంటే విని ఆశ్చర్య పడతారు. లేడనే వారి తర్కం, ప్రజలను ఆకర్షించలేదు. వారు ప్రజలను ఆకర్షించినా భగవద్భక్తిని ప్రజలనుండి దూరం చేయలేకపోయారు. అందువల్ల ప్రజల మనస్తత్వానికి అనుగుణంగా ఏదో ఒక రూపంలో బౌద్దులు పెట్టవలసి వచ్చింది. దేవుడు లేడనేవానికే వారు విగ్రహాలు పెట్టి పూజించారని లోగడ వివరించాను. ఇట్టి స్థితిలో శంకరులకు, వారితో పెద్దగా చర్చించవలసిన అవసరం లేకపోయింది. భక్తి తత్వాన్ని వైదిక మార్గంలో ఉన్నదాన్నే ఇంకా బలపరచడం కోసం, అనేక స్తోత్రాలను శంకరులు వ్రాసేరు. యంత్ర ప్రతిష్టాపనలు చేసారు. ప్రజలలో కాపాలికాచారాలను, వామ మార్గాలను ఖండించి వైదిక పద్ధతికి దోహదం చేసారు. బుద్ధి బలంతో భక్తిని పాదుకొల్పలేం. హృదయ బలంతోనే వ్యాప్తి చేయగలమని శంకరులు భావించారు.


భగవానుడు ఈ సమస్త ప్రపంచానికీ ఉపాదాన కారణంగా, నిమిత్త కారణంగా ఉన్నాడని శంకరులు ప్రతిపాదించారు. అంటే ఏమిటి? ఒక వస్తువును తయారు చేయాలంటే ఒక ముడిపదార్థం లేదా మూల పదార్థం ఉండాలి. ఒక నగను తయారు చేస్తే దానికి బంగారమో, వెండియో ఉండాలి. ఇంటికి కావాలి. నగకు బంగారం, ఉపాదాన కారణం. నగ కంసాలియుంటేనే తయారవుతుంది. కనుక ఇతడు నిమిత్త కారణమౌతాడు.


అద్వైతం ప్రకారం ఉపాదానమూ, నిమిత్తమూ ఈశ్వరుడే. కనబడే జగత్తు, మిథ్యయని, ఉన్నట్లు కన్పిస్తోందని ఇది శాశ్వతం కాదని, శాశ్వతమైనట్లుగా ఉందని అనినప్పటికీ నిత్య వ్యవహారం సాగిపోతుంది. ఇట్లా తాత్కాలికంగా సత్యమనిపించే దానిని వ్యవహార సత్యమన్నారు. దీనికి మూల వస్తువూ ఉండాలి. తయారు చేసేవాడూ ఉండాలి. ఈ రెండూ ఒకటంటుంది అద్వైతం. అతడొక మూల వస్తువుతో చేసాడంటున్నాం. అది ఎక్కడినుండి వచ్చింది? అతనికంటే మరొకటి లేదు కదా! అతని నుండే వచ్చిందని, అతడే వివిధ వస్తువులుగా కన్పడేటట్లు చేసేవాడని, ఉపాదన నిమిత్తాలతడే అంటుంది. కలలో అనేకమైన వాటిని చూస్తున్నాం. ఇవి ఎక్కడినుంచి వచ్చాయి? మన మనస్సు నుండే ఈ స్వప్న ప్రపంచం రాలేదా?


No comments:

Post a Comment