Wednesday 27 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 144 వ భాగం



శాంతి నెలకొల్పబడిన తరువాత మరల మూర్తులు, స్వస్థలాలకు వెళ్ళాయి. కాని కామాక్షి విగ్రహం, తంజావూర్లో స్థిరంగా ఉండిపోయింది. కారణం తర్వాత చెబుతాను.


ఉడయార్ పాళెంలో, శివ, విష్ణు ఆలయాలున్నాయి. ఈనాటికీ శివాలయంలో సభాపతి మంటపం, త్యాగరాజు మంటపమని, కామాక్షి మంటవమని ఉన్నాయి. విష్ణ్వాలయంలో రంగరాజు, వరద రాజుమూర్తులుండేవి.


ఆ సమయంలో తంజావూర్ని ప్రతాప సింహుడు పరిపాలిస్తూ ఉండేవాడు. మన స్వాముల వారిని మఠాన్ని అక్కడే ఉండేటట్లుగా ప్రార్ధించాడు. మన స్వామి స్వర్ణ కామాక్షిని కూడా తీసుకొని వెళ్ళారు.


తంజావూర్లో ఉండడం కంటె కావేరీ తీరంలోని కుంభకోణంలో మఠం వీలుగా ఉంటుందనే అభిప్రాయాన్ని స్వామివారు వెల్లడించగా రాజు అంగీకరించాడు. మంత్రియైన దబీర్ పంత్ తో ఏర్పాట్లు చేయవలసిందిగా రాజన్నాడు. అట్లా కంచి మఠానికి కుంభకోణం ప్రధాన కేంద్రమైంది. ప్రజలకు, రాజునకు తృప్తి కలిగించడం కోసం తంజావూర్లోనే స్వర్ణ కామాక్షి విగ్రహం ఉంటుందని స్వామివారన్నారు. రాజు, అమ్మవారికి గుడి కట్టించాడు. శ్యామశాస్త్రి వ్రాసిన తెలుగు పాటలలో ఆమెను బంగారు కామాక్షి అని అన్నారు. దానితో ఆమె బంగారు కామాక్షిగా ప్రసిద్ధిని పొందింది.


కుంభకోణాన్ని ఎందుకెన్నుకున్నారని సందేహించాను. తంజావూర్ దగ్గరే కావేరి, 'పంచనదం'గా నాల్గు శాఖలతో ప్రవహిస్తోంది. అక్కడే తిరువైయార్ ఉంది. భూలోక కైలాసంగా ఆ క్షేత్రం ప్రసిద్ధిని పొందింది. కావేరీ తులాస్నానానికి ప్రసిద్ధమైన మాయావరం క్షేత్రం కూడా ఉంది. అయితే కుంభకోణానికి శంకరులు అవతారానికి సంబంధం ఉంది.


No comments:

Post a Comment