Saturday 23 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 140 వ భాగం



ముందుగా అనేక ప్రాంతాలనుంచి మత్స్యకారులు వచ్చారు. దీనిని వైదిక భూమిగా చేద్దామని వైదిక అనుష్టానం బాగా తెలిసిన బ్రాహ్మణులను రప్పించాలనుకున్నాడు.


కేరళలో తమిళం


చోళ రాజ్యం నుండి వచ్చినవారిని బోళియర్లని అంటారు. వీరు ద్రవిడ ప్రాంతం నుండి వచ్చారు. ఆర్య ద్రావిడ భేదాలు కల్పితమని చాలాసార్లు చెప్పాను. వారు వేరు వీరు వేరనే భావనను పెకలించండి. ద్రవిడ దేశం నుండి ఉత్తర దేశానికి వెళ్ళినవారిని ద్రావిడ్ అనేవారు. అట్లాగే ఉత్తర దేశం నుండి వచ్చినవారూ ఇక్కడున్నారు. వారిని 'వాడమర్' అంటారు. (ఎవ్వరూ కైబర్ పాస్ నుండి వచ్చినవారు కాదు).


చోళియర్లు కేరళ ప్రాంత వాతావరణం పరిస్థితులకు తట్టుకోలేకపోయారు. నిరంతరం వర్షంతో చిత్తడితో ఉన్న నేల వారికి నచ్చలేదు. పరశు రామునికి తెలియకుండా రహస్యంగా తిరిగి వెళ్ళిపోదామనుకున్నారు. వీరి భావనను ఆయన గమనించి వీరి ఆచారాలలో కొన్ని మార్పులను చేసాడు. మార్పులను చేసినా వారు వెళ్ళిపోతే అక్కడ ఉండలేక తిరిగి వస్తారని ఊహించాడు. వారికి నెత్తిపై ఊర్ధ్వశిఖ ఉంటుంది. మనమాదిరిగా వెనుక నుండదు. ఇప్పటికీ నంబూద్రీ బ్రాహ్మణులీ ఆచారాన్ని పాటిస్తున్నారు. చాలామంది చోళ దేశం తిరిగి వెళ్ళిపోయారు. అందులో ఇట్లా ఊర్ధ్వశిఖ గలవారు తమిళనాడులో ఇప్పటికీ ఉన్నారు.


చాలామంది చోళియర్లు వెళ్ళిపోవడం గమనించి కన్నడ, ఆంధ్రప్రాంతాల నుండి బ్రాహ్మణులను రప్పించాడు. ముందు వీరికి ఉన్న 108 ఆచారాలలో అనేక మార్పులు చేసి వీరిని స్వస్థలాలకు వెళ్ళకుండా చేసాడు.


ఇట్లా ఉండిపోయిన వారిని నంబూద్రీ బ్రాహ్మణులని అంటారు. ఇదంతా కేరళోత్పత్తియనే గ్రంథాన్ని చూసి చెబుతున్నా.


No comments:

Post a Comment