Thursday 21 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 138 వ భాగం





ప్రభుత్వం అండగా ఉంటే కుమారిల భట్టు జయించాడని భావించినా శంకరులు మాత్రం ఎట్టి సాయం లేకుండానే తమ బుద్ధి బలంతో ప్రతిపక్షులనెదుర్కొనారు. బౌద్ధమతం, జైనమతం, రాజుల ప్రోద్భలంతో వృద్ధి పొందాయి. అప్పర్, జ్ఞాన సంబంధర్, పల్లవ, పాండ్యరాజులును మరల వైదికమార్గంవైపు మళ్లించారు. రాజెప్పుడైతే మారాడో ప్రజలూ వైదిక మతం వైపు మళ్ళారు. అటువంటిది శంకరుల జీవితంలో కనబడదు. వారి కాలంలో పెద్ద పెద్ద రాజులు లేరని, చక్రవర్తి లేకపోవడం వల్ల వర్ణాశ్రమ ధర్మం క్షీణించిందని వారి 'సూత్రభాష్యం' వల్ల అవగతమౌతుంది.


రాజుల ప్రోద్బలంతో కుమారిలుడు, మండన మిశ్రుడు బౌద్ధమతాన్ని ఖండించడంతో బాటు అద్వైతాన్ని, ఎదుర్కొనగా శంకరులు వీరిని ఎదుర్కొని ఖండించారు. కుమారిలునితో వివాదానికి అవకాశం ఏర్పడలేదు. కాని వారి శిష్యుడైన మండన మిశ్రునితో 21 రోజులు వాదించి ఓడించారు. మండనుడు గృహస్థు కనుక, సరస్వతి, ఇతని భార్య సరసవాణిగా వచ్చింది.


మరొక కారణం ఉంది. శంకరుల సర్వజ్ఞత్వాన్ని పరీక్షించాలంటే సాక్షాత్తూ సరస్వతియే దిగి రావాలి. అందుకే ఆమె అట్లా అవతరించింది.


దేవతలు మొరపెట్టడం, శివగురు, ఆర్యాంబల మొరలాలించి శంకరుడే శంకరులుగా అవతరించాడు. ఇది ఎట్లా, ఎప్పుడో చూద్దాం.


కేరళ చరిత్ర


కేరం అంటే కొబ్బరి చెట్టు. అవి ఎక్కువగా నున్న దేశం కేరళ దేశం. ఒక మూల పర్వతాలు, మరొక మూల సముద్రం మధ్యనున్న దేశమది.


1 comment: