Friday 22 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 139 వ భాగం



పరశురాముడు, దుష్ట క్షత్రియులపై 21 సార్లు దండెత్తాడని తెలుసు. ఇతనికి విరక్తి కలిగింది. ఈ రాజ్యాన్ని నేనేం చేసుకోను? నేను చేసిన కర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకొని తపస్సు చేసుకొంటానని భూమినంతటినీ కశ్యప మహర్షికి ధారాదత్తం చేసాడు. మనం మనువు యొక్క సంతానం. మనువు యొక్క తండ్రి వివస్వంతుడు. వివస్వంతుని తండ్రి కశ్యపుడు. ఇతడే మనుష్యజాతికి మూల పురుషుడు. అతడు ప్రజాపతి కనుక, దేవాదులకూ తండ్రియే. ఎందరో ప్రజాపతులున్నా మనుష్య జాతి వృద్ధికి ఇతడు కారణం కనుక ఇతణ్ణి కశ్యప ప్రజాపతియని గౌరవంతో పిలుస్తాం.


ఇంటిని దానం చేసి మరల ఇంటిలో ఉండటం కుదురుతుందా? అందుచేత పరశురాముడు ఈ భూమిలో ఉండకుండా క్రొత్త ప్రదేశాన్ని ఎన్నుకొని తపస్సు చేద్దాం అనుకున్నాడు. అందుకే దానమిచ్చిన భూమిలో ఉండకూడదనే పరశురాముని భావనను కశ్యపుడు గమనించి జ్ఞాన దృష్టితో దానమిచ్చిన భూమి బయట తపోభూమిని చూడమని చెప్పాడు.


పరశురాముడు పశ్చిమ కనుమలకు వచ్చి కొండ శిఖరం ఎక్కాడు. ఆనాడు సముద్రం కొండకు సమీపించి యుండేది. అంటే కొండ కివతల మలయాళదేశం లేదు. కేవలం సముద్రమే ఉండేది. దానమిచ్చిన ప్రాంతంలో నేను ఉండకూడదు కనుక ఈ కొండ దగ్గర నువ్వు తొలగి నాకు కొంత చోటు నిప్పించుమని పరశురాముడు సముద్రుణ్ణి అడిగాడు.


రామునకు సముద్రుడు సాయం చేసినట్లే ఇతనికీ చేసాడు. నీ చేతిలో పరశువు ఉంది కదా, దానిని విసిరివేయగా అది ఎక్కడ పడుతుందో అంతమేర, నేను వెనుక తగ్గుతానని సముద్రుడన్నాడు. అట్లా ఏర్పడినదే మలయాళ దేశం. ఇక్కడ చాలా మంది పరశురాముని పేరుతో ఉంటారు.


No comments:

Post a Comment