Friday 8 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 125 వ భాగం



మధ్వాచార్యుల పూర్వాశ్రమ నామం వాసుదేవులు. తరువాత వారు ఆనంద తీర్థులయ్యారు. వీరినే పూర్ణ ప్రజ్ఞులని అంటారు. వాసుదేవ పదానికి వారి సన్న్యాసి నామానికి పోలిక లేదు. కృష్ణ చైతన్యుని పూర్వనామం గౌరాంగుడు. కృష్ణుడు నలుపు. గౌరాంగుడంటే తెల్లనివాడు. కనుక రెంటికీ పోలిక లేదు. శంకరులకే రెండు ఆశ్రమాలలోని నామాలూ ఒకటయ్యాయి.


గోవిందులు గొప్పదనం


గోవిందులు ఏమి వ్రాసారో తెలియదు. యోగతారావళి, అద్వైతానుభూతి వ్రాసేరని అంటారు. శంకరులే వ్రాసేరనీ ఉంది. శంకరులు వ్రాసేరన్నా గురువులనుండి స్ఫూర్తిని పొందినట్లు భావించవచ్చు. యోగతారావళిలో అష్టాంగ యోగాన్ని అనుసరిస్తే సమాధి స్థితిని పొందవచ్చని అద్వైతానుభూతి కల్గుతుందని చెప్పబడింది. పతంజలి యోగ సూత్రాలు వ్రాసేడని తెలుసు కదా! ఆ పతంజలియే గోవిందులని చదివాం. అద్వైతాను భూతిలో క్రియతో కూడిన యోగం కాక, కేవలానుభూతి గురించే యుంటుంది.


గౌడపాదులనుండి మహాభాష్యాన్ని నేర్చుకున్నట్లు విన్నాం. అయితే ఇతడేమీ వ్యాకరణ గ్రంథం వ్రాయలేదు. శాస్త్ర ప్రచారం చేసాడు. ఎందరినో శిష్యులను తయారు చేసాడు. సంగీత శాస్త్రజ్ఞులలో కొందరికి ప్రత్యేక శాస్త్రజ్ఞానం అంటూ లేకపోయినా, సంగీత పరిశోధకుల కంటె ఎందరినో శిష్యులను తీర్చి దిద్దినవారున్నారని విన్నాం అంటే బుద్ధి కంటే అనుభవానికీ ప్రాధాన్యం. ఇతరులను తీర్చిదిద్దడం మాటలా?


బుద్ధిమంతులు కావచ్చు, కాని అందరూ అధ్యాపకులు కాలేరు. అట్టి ఆచార్యత్వం గోవిందులలో ఉంది.


అయితే మామూలు శిష్యునిగా తీర్చిదిద్దినట్లు శంకరులను తీర్చి దిద్దాలా? పరమేశ్వరుడు శంకరులుగా అవతరించినపుడు శిష్య గురు సంప్రదాయాన్ని తెలియపరచాలని గురువుల గొప్పదనం, శిష్యులను తీర్చిదిద్దే పద్ధతి లోకంలో తెలియజెప్పాలని శిష్యుడిగా చేరారు.


No comments:

Post a Comment